న్యూఢిల్లీ: భారత్లో కరోనా వ్యాప్తికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం నాటి హెల్త్ బులిటెన్ను విడుదల చేసింది. భారత్లో గత 24 గంటల్లో కొత్తగా 1,211 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దీంతో.. ఇప్పటివరకూ భారత్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 10,363కు చేరింది. గత 24 గంటల్లో 117 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటివరకూ భారత్లో కరోనా బారిన పడిన వారిలో 1036 మంది కోలుకున్నట్లు ప్రకటించింది. గడచిన 24 గంటల్లో కరోనా వల్ల భారత్లో 31 మంది చనిపోయినట్లు కేంద్రం వెల్లడించింది. భారత్లో కరోనా బారిన పడి ఇప్పటివరకూ 339 మంది మృతి చెందినట్లు కేంద్రం తెలిపింది.
ఇదిలా ఉంటే.. ఇప్పటివరకూ భారత్లో 2,31,902 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు ఐసీఎమ్ఆర్ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే 18,644 శాంపిల్స్ను టెస్ట్ చేసినట్లు వెల్లడించింది. 2,991 శాంపిల్స్ ప్రైవేట్ ల్యాబ్ల్లో టెస్ట్ చేసినట్లు ఐసీఎమ్ఆర్ తెలిపింది. ఐసీఎమ్ఆర్ పరిధిలో 166 ల్యాబ్ల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయని, 70 ప్రైవేట్ ల్యాబ్ల్లో కూడా కరోనా పరీక్షలు జరుగుతున్నాయని కేంద్రం స్పష్టం చేసింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి