19, జులై 2021, సోమవారం

ఆ ఐపిఎస్‌ దారెటు?


ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ
            సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి, TELANGANA STATE అడిషనల్‌ డిజిపి డాక్టర్‌ ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తును సోమవారం (19-07-2021) ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యరద్శి సోమేష్‌కుమార్‌కు, కేంద్ర ప్రభుత్వానికి ఇ-మెయిల్‌ ద్వారా పంపారు. సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా 2013 నుంచి సమర్థవంతంగా పనిచేస్తున్న ఆయన తీసుకున్న నిర్ణయం అధికార వర్గాల్లోనూ, రాజకీయ వర్గాలోనూ చర్చనీయాంశమైంది. ఆయన నిర్ణయాలవలన మంచి ఫలితాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ గురుకులాలను అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చేశారు. ఆయన మాటలో ముక్కుసూటితనం, స్పస్టత, ఉద్యోగంపట్ల అంకిత భావం ఉంటుంది. నాలక్ష్యం ఇది అని దానిని సాధించేందుకు ప్రయత్నించే వారు చాలా అరుదు. అలాంటి కోవకు చెందిన వారిలో ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఒకరు. ఆయనతో మాట్లాడితే సామాజిక అసమానతలకు శత్రువులెవరు, మిత్రులెవరనేది అట్టే తేలిపోతుంది. సామాజిక అణచివేతకు గురయిన సామాన్యులను అభివృద్ధివైపు నడిపించాలనే ఆయన తపన అర్థమౌతుంది. ఆయన మాటల్లో చేతల్లో ఒకటే ఉండటం వలన ఆయనకు కొందరు శత్రువులు కూడా ఏర్పడ్డారు. ఆయన డైనమిజం, ధైర్యం ముందు నిలబడలేకపోయారు. గురుకుల విద్యార్థులను ఎవరెస్టు ఎక్కించారు. ఆంగ్లభాష ప్రవేశపెట్టి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు. అందుకు పాలకుల పూర్తిస్థాయి ప్రోత్సాహం కూడా తీసుకున్నారు. స్వేరోస్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసి సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని లక్షల మంది పూర్వ విద్యార్థులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఆయన అంబేద్కర్‌, జ్యోతిరావుఫూలే ఆశయాల సాధనకు కృషి, పట్టుదలతో ఉన్నారు. ఆ నేపథ్యంతో ఆయన బిఎస్‌పిలో చేరుతారా? లేక అదేతరహాలో కొత్తపార్టీ పెడుతారా అని చర్చ నడుస్తోంది. మరోపక్క ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఈమధ్య తగ్గిపోయిందని కూడా మరోచర్చ నడుస్తోంది. గురుకుల విద్యాలయాలకు కావల్సిన నిధులు కేటాయించక పోవడం, బకాయిలు పేరుకుపోయాయని అనుకుంటున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో త్వరలో జరిగే హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత ఐఎఎస్‌ అధికారి ఆకునూరి మురళీ విఆర్‌ఎస్‌ తీసుకోగా, ఇప్పుడు మరో దళిత ఐపిఎస్‌ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు.
        అట్టడుగు వర్గాలకు ఇంతకన్న మంచి సేవ చేయడానికే తాను ఉద్యోగ విరమణ చేశానని ఎంతటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. సాంఘిక సంక్షేమ గురుకులాలు సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని కూడా ఒక హెచ్చరిక చేసినట్లు ఆయన రాజీనామాలో పేర్కొన్నట్లు అర్థమౌతుంది. ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారని అత్యంత అనుచరుల దారా తెలుస్తోంది. ఆయన ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోబోతారనేది త్వరలో తేటతెల్లం కావచ్చు. రాజకీయాల్లోకి వస్తారా అంటే రాకూడదని లేదుగదా అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో పోటీ అనడం వాస్తవం లేదని స్పస్టత ఇచ్చారు.

కామెంట్‌లు లేవు: