10, డిసెంబర్ 2018, సోమవారం

11న ఐదు రాష్ట్రాల ఫలితాలు వెల్లడి



               2018 డిసెంబర్ 11న ఉదయం 8 గంటలకు  ఐదు రాష్ట్రాల కౌంటింగు ప్రారంభమవుతాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మొత్తం 1,74,724 ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల(ఈవీఎం)ను ఈసీ తెలిపింది. ఐదు రాష్ట్రాల్లో పోటీ చేసిన మొత్తం అభ్యర్థుల సంఖ్య దాదాపు 8,500గా ఉంది. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మొత్తం 670 స్ట్రాంగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 65,367 ఈవీఎంలను వాడారు. ఆ రాష్ట్రంలో 2,907 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఐదు రాష్ట్రాల్లో కలిపి 679 సీట్లు ఉండగా, వాటిలో 678 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రాజస్థాన్‌లో బీఎస్పీ అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందగా, ఆ స్థానంలో ఎన్నిక వాయిదా పడింది.
          మంగళవారం స్ట్రాంగ్‌ రూమ్‌లను తెరవనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌లా ఈ శాసనసభ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఎన్నికల్లో గెలవడం తమకు చాలా ముఖ్యమని ఆ పార్టీ భావిస్తోంది. మిజోరంలో కాంగ్రెస్‌, తెలంగాణలో తెరాస అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో భాజపా ఇప్ప‌టికి వరుసగా మూడుసార్లు గెలిచింది. ఆయా రాష్ట్రాల్లో నాలుగోసారి కూడా విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. రాజస్థాన్‌లో 2013 శాసనసభ ఎన్నికల్లో గెలిచిన భాజపా.. రెండోసారీ అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది.
               ఈ మూడు రాష్ట్రాలు 2014 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు భారీ మెజార్టీ తెచ్చిపెట్టడానికి కారణమయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 65 లోక్‌సభ సీట్లు ఉండగా, వాటిల్లో 62 స్థానాల్లో భాజపా గెలుపొందింది. ఈ ఎన్నికల్లో గెలవడం కాంగ్రెస్‌కి కూడా చాలా ముఖ్యమే. దేశంలో బలంగా ఉన్న భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేయాలనుకుంటున్న కాంగ్రెస్‌.. ఈ ఎన్నికల్లో గెలిచి ఆత్మ విశ్వాసంతో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తోంది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగానే పలు పార్టీలతో పొత్తులు పెట్టుకుంది. రాజస్థాన్‌లో లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌, రాష్ట్రీయ లోక్‌ దళ్, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ)తో పొత్తు పెట్టుకుంది, తెలంగాణలో తెదేపా, తెజస‌, సీపీఐలతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది.