2, ఆగస్టు 2019, శుక్రవారం

జర్నలిస్టు రవీష్ కుమార్‌కు రామన్‌ మెగసెసె

                దిల్లీ: ఆసియా నోబెల్‌గా అభివర్ణించే ప్రతిష్ఠాత్మక పురస్కారం రామన్‌ మెగసెసె అవార్డు 2019 సంవత్సరానికి గానూ భారత్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టు రవీష్‌కుమార్‌ ఎంపికయ్యారు. ఈ ఏడాది ఈ అవార్డు మొత్తం ఐదుగురికి లభించింది. అందులో రవీష్‌కుమార్ ఒకరు. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో సెప్టెంబరు 9న ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.
        ఎన్డీటీవీలో ప్రసారమయ్యే రవీష్‌ కుమార్‌ కార్యక్రమం ‘ప్రైమ్‌ టైమ్‌ షో’ ఎంతో ప్రజాదరణ పొందింది. నిస్సహాయుల గళాన్ని చాటిచెప్పడానికి రవీష్‌కుమార్‌ జర్నలిజాన్ని ఉపయోగించుకుంటున్నారని రామన్‌ మెగసెసె అవార్డు ఫౌండేషన్‌ అభిప్రాయపడింది. అలాగే ‘‘నైతికత, నిబద్ధతతో అత్యున్నత ప్రమాణాలతో తన వృత్తిని నిర్వహించడం; స్వాతంత్ర్యం, నిజం, సమగ్రత కోసం నైతిక ధైర్యంతో పోరాడడం; స్వరం లేని నిస్సహాయుల గళంగా మారడం; ప్రజాస్వామ్య లక్ష్యాల్ని చేరుకోవడం కోసం ఆయన సూత్రప్రాయమైన నమ్మకం’’ లాంటి లక్షణాలకు గుర్తింపుగా ఈ అవార్డును రవీష్‌ కుమార్‌కు ప్రదానం చేస్తున్నట్లు ఫౌండేషన్‌ పేర్కొంది. 
         రవీష్‌కుమార్‌తో పాటు మయన్మార్‌ జర్నలిస్టు కో స్వీ విన్, థాయ్‌లాండ్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఆంగ్‌ఖానా నీలప్‌జిత్‌, దక్షిణ కొరియాకు చెందిన సామాజిక కార్యకర్త కిమ్‌ జోంగ్‌-కి, ఫిలిప్పీన్స్‌కు చెందిన రేముండో పూజంతే కయబ్యాబ్‌ను ఈ అవార్డు వరించింది. 2018లో భారతదేశానికి చెందిన భరత్ వాట్వానీ, సోనమ్ వాంగ్‌చుక్‌కు ఈ అవార్డు లభించిన విషయం తెలిసిందే.
              ఈ అవార్డును ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసె జ్ఞాపకార్థం 1957లో ఏర్పాటు చేశారు. దీన్ని ఆసియా నోబెల్‌గా అభివర్ణిస్తారు. ప్రతి సంవత్సరం రామన్ మెగసెసె ఫౌండేషన్.. ప్రభుత్వ సేవలు, ప్రజా సేవ, సామాజిక నాయకత్వం, జర్నలిజం, సాహిత్యం, సృజనాత్మకత, ప్రపంచ శాంతి, అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు లాంటి అంశాల్లో కృషి చేస్తున్నవారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

కామెంట్‌లు లేవు: