20, మే 2020, బుధవారం

21 నుంచి ఆర్ టి సి బస్సులు రోడ్డు పైకి


  • ఆన్‌లైన్‌లో లేదా బస్టాండ్‌లో టికెట్‌ కొనాలి
  • గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలోనే అనుమతి
  • తొలుత 15% బస్సులతో ప్రారంభం
  • విజయవాడ, విశాఖలో కొంత ఆగాలి

            ఆర్టీసీ బస్సులు అరవై రోజుల తర్వాత ఎట్టకేలకు రోడ్డెక్కుతున్నాయి. లాక్‌ డౌన్‌తో రెండు నెలలుగా డిపోలకే పరిమితమై 2020 మే 21
గురువారం నుంచి ప్రయాణికులను గమ్యం చేర్చేందుకు సిద్ధమవుతున్నాయి. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలోని ప్రజల ప్రయాణ అవసరాలు తీర్చేందుకు పది నుంచి పదిహేను శాతం బస్సులు డిపోల నుంచి బస్టాండ్లకు చేరనున్నాయి. అప్పటికే ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకున్న వారినీ, బస్టాండుకు వచ్చి గ్రౌండ్‌ బుకింగ్‌ ద్వారా టికెట్‌ తీసుకున్నవారినే బస్సుల్లోకి ఎక్కిస్తారు. నగదు ద్వారా కొవిడ్‌ వచ్చే అవకాశం ఉందని, అందుకే కండక్టర్‌ బస్సులో ఉండకుండా ఈ విధానం అమల్లోకి తీసుకొస్తున్నామని ఆపరేషన్‌ విభాగానికి చెందిన కీలక అధికారి ఒకరు చెప్పారు. నిజానికి, ఈ నెల 18 నుంచే బస్సులు తిప్పేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. అయితే, ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఇందుకు రెండు రోజులు ఆగాల్సి వచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా 128 బస్‌ డిపోలు ఉన్నాయి. వీటిలో వీలైనన్ని డిపోల నుంచి సాధ్యమైనన్ని బస్సులు నడపాలని అధికారులు భావించారు. అందుకు అనుగుణంగా అంతా సిద్ధమవ్వడంతో, ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ అధికారికంగా ప్రకటన చేసేందుకు మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటికే ముఖ్యమంత్రి జగన్‌తో రవాణాశాఖ మంత్రి పేర్ని నాని, టాస్క్‌ఫోర్స్‌ ఉన్నతాధికారులు సమావేశం అవడంతో.. ఆర్టీసీ ఎండీని పిలిపించారు. విలేకరుల సమావేశం రద్దు చేసుకుని వెళ్లిన ఎండీ, ఇతర అధికారులతో కలిసి పలు అంశాలపై చర్చించారు.                         బస్సుల్లో సీటింగ్‌ మార్పు, గ్రీన్‌ జోన్ల మధ్య తిప్పేందుకు ప్రణాళిక, రెడ్‌ జోన్లలో పాటించే నిబంధనలు, తక్కువ సీట్లతో తిప్పితే వచ్చే నష్టం, ప్రజలకు బస్సులు తిరగడం వల్ల కలిగే ఉపయోగం తదితర అంశాలపై చర్చించారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ.. హైదరాబాద్‌ మినహా రాష్ట్రమంతా తిప్పేందుకు నిర్ణయం తీసుకొంది. అదే తరహాలో మన రాష్ట్రంలోనూ పెద్దనగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో మరికొన్ని రోజులు బస్సులు నడపరాదని నిర్ణయించారు. చార్జీల విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి పెంపు లేకుండా పాత రేట్లతోనే నడపాలని సీఎం చెప్పడంతో అధికారులు సరేనన్నారు. అయితే డిపోల్లో కొన్ని బస్సులకే సీటింగ్‌ విధానం మార్చడం వల్ల వీలైనంత మేరకు బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. స్పందన ద్వారా టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. కాగా, ఆర్టీసీ బస్సులు తిప్పడంపై బుధవారం ఎంపీ మాదిరెడ్డి ప్రతాప్‌ అధికారికంగా ప్రకటన చేయనున్నారు.

కామెంట్‌లు లేవు: