27, మే 2012, ఆదివారం

వైఎస్‌ జగన్‌ అరెస్టు

             ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కడప ఎంపీ, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు యెడుగూరి సందింటి జగన్మోహన్‌రెడ్డి ఆదివారం రాత్రి అరెస్టయ్యారు. తండ్రి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అధికారాన్ని ఉపయోగించుకుని అక్రమంగా పెద్దయెత్తున ఆస్తులు పోగేసుకున్నారన్న కేసులో మూడు రోజులుగా జగన్‌ను విచారించిన సిబిఐ 2012 మే 26న రాత్రి అరెస్టు చేసింది. ఆయన్ను 27(సోమవారం) సిబిఐ కోర్టు ఎదుట హాజరు పరచనున్నారు. జగన్‌పౖౖె ఐపిసి సెక్షన్లు 120బి (రెడ్‌విత్‌ 420), 409, 420, 477ఎ, అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 13(2) రెడ్‌విత్‌ 13(1), (సి), (డి) కింద సిబిఐ కేసులు నమోదు చేసింది. అరెస్టుకు నిరసనగా వైకాపా సోమవారం నాడు రాష్ట్రవ్యాపిత బంద్‌కు పిలుపునిచ్చింది. జగన్‌ చేసిన తప్పేమిటంటూ వైకాపా గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ, జగన్‌ భార్య భారతి, సోదరి శర్మిలా దిల్‌కుశ అతిథిగృహం ఎదుట ధర్నాకి దిగారు. వారిని అక్కడి నుంచి పోలీసులు అదుపులోకి తీసుకుని లోటస్‌పాండ్‌ వారి నివాసానికి తరలించారు. హైదరాబాద్‌ నగరంతో సహా రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించారు. కేసు దర్యాప్తులో ఉన్నందున దీనిపై మాట్లాడేదేమీ లేదంటూ కాంగ్రెస్‌ ప్రతినిధి మనీష్‌ తివారీ దాటవేశారు. కాంగ్రెస్‌, తెలుగుదేశం కుమ్మక్కైన ఫలితమే జగన్‌ అరెస్టని వైకాపా ఆరోపించింది. అరెస్టు చేస్తే చాలదు ఆయన అక్రమంగా ఆర్జించిన మొత్తం సొత్తును స్వాధీన పరచుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది. జగన్‌ను అరెస్టు చేసిన సిబిఐ వివాదాస్పద జీవోల జారీకి బాధ్యులైన మంత్రులను కూడా విచారించి అరెస్టు చేయాలని, తద్వారా సిబిఐ తన నిష్పాక్షికతను నిరూపించు కోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు వ్యాఖ్యా నించారు. ఇదీ హర్షించదగిన పరిణామమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు.
           వైఎస్‌ జగన్‌పై నేరపూరిత కుట్ర, మోసం, విశ్వాస ఘాతుకం (క్రిమినల్‌ బ్రీచ్‌ ఆఫ్‌ ట్రస్ట్‌), ఖాతాలను తప్పుగా నిర్వహించడం, నేరపూరిత ప్రవర్తన తదితర సెక్షన్ల కింద సిబిఐ కేసులు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కూడా కేసులు పెట్టారు. వీటి ప్రకారం నేరాలు రుజువైతే గరిష్టంగా పది సంవత్సరాల నుంచి యావజ్జీవం వరకూ జైలు శిక్షపడే అవకాశం ఉంది.
                                                               సెక్షన్‌ దేనికోసం శిక్ష
ఐపిసి 120 (బి) నేరపూరిత కుట్ర
420 మోసం ఏడేళ్లు
409 విశ్వాస ఘాతుకం యావజ్జీవం
(క్రిమినల్‌ బ్రీచ్‌ ఆఫ్‌ ట్రస్ట్‌) లేదా పదేళ్లు
477 (ఎ) ఖాతాలను తప్పుగా నిర్వహించడం ఏడేళ్లు
(ఫాల్సిఫికేషన్‌ ఆఫ్‌ అక్కౌంట్స్‌)
                        అవినీతి నిరోధకచట్టం
13(1) ప్రజాప్రతినిధి నేరపూరిత స్వభావంతో వ్యవహరించడం
13(1సి) ప్రజాప్రతినిధిగా సంక్రమించిన కార్యాలయాన్ని,
ఆస్తులను దుర్వినియోగపరచడం
13(డి) (1) తనకు గాని ఇతరులకు గాని చట్టవ్యతిరేక
పద్ధతులు లేదా అవినీతికి పాల్పడి ఆర్థిక లాభాలను,
విలువైన వస్తువులు పొందడం.
(2) తన పదవిని దుర్వినియోగపరిచి ఆర్థిక లాభాలు పొందడం
(3) పదవిలో ఉండగానే ఎటువంటి ప్రజాప్రయోజనం
లేకుండా ఆర్థిక లాభాలు పొందడం
13(2) కనిష్టంగా ఒక ఏడాది నుండి గరిష్టంగా ఏడేళ్ల వరకు

ఆశావాది ప్రతిభకు అరుదైన గౌరవం

                                      కళారత్నకు కర్నూలు తెలుగు రచయితల సంఘం సన్మానం
                  అవధాన ప్రక్రియలో అత్యంత ప్రతిభావంతుడు డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావుకు కళారత్న అవార్డు రావడం అరుదైన గౌరవమని ఆయన సన్మాన సభలో వక్తలు కొనియాడారు. ఆదివారం కళారత్న డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావుకు కర్నూలు తెలుగు రచయితల సంఘం ఆధ్వర్వంలో సిటీ కేంద్ర గ్రంధాలయంలో ఘనంగా సన్మానించారు. కర్నూలు తెలుగు రచయితల సంఘం అధ్యక్షులు హీరాలాల్‌ అధ్యక్షతన సన్మాన సభ జరిగింది. ఈసందర్భంగా ప్రముఖ కవి , విమర్శకుడు గొట్టిముక్కుల సుబ్రమణ్యశాస్త్రి మాట్లాడుతూ సంస్కారవంతంగా జీవించిన ప్రముఖుల మాదిరిగా జాషువా, దువ్వూరి రామిరెడ్డి లాంటి కవికోకిల డాక్టర్‌ ఆశావాది అని అన్నారు. 171 అష్టావధానాలు చేసి సభికులను మెప్పించారని చెప్పారు. ఆయనకు కళారత్న, పద్మభూషణ లాంటి అవార్డులు ఎప్పుడో రావల్సిందని అన్నారు. ఇప్పటికైనా ఆశావాదికి కళారత్న అవార్డు రావడం ప్రభుత్వానికే గౌరవమని అన్నారు. డాక్టర్‌ ఎన్‌.శాంతమ్మ మాట్లాడుతూ ప్రతిభ, విత్పత్తి, పరుగుతీసే కైత డాక్టర్‌ ఆశావాది సొంతమని అన్నారు. ధార, ధోరణి, ధైర్యం నిర్భయంతో ఆశావాది అవధానం చేశారని కొనియాడారు. శతావదాని సివి సుబ్బన్న, బోగిసెట్టి జూగప్ప, నండూరి రామకృష్ణమాచార్య శిష్యరికంలో ఆయన పద్యకవిగా, అష్టావధానిగా ఎదిగారని అన్నారు. 2008లో ఆశావాది సాహితీస్వర్ణోత్సవాల సందర్భంగా పెనుకొండలో రెండు రోజులపాటు పది సాహితీ వేదికల్లో వివిధ ప్రక్రియల్లో కార్యక్రమాలు కన్నుల పండువగా నిర్వహించారని చెప్పారు. అంతేకాకుండా ఆశావాదిని కుంచెంఅశ్వత్తయ్య గండెపిండేరం తొడిగి గొప్ప సన్మానం చేశారని అన్నారు. శాంతమ్మతో ఆశావాదికి ఉన్న సాహితీ పరిచయాన్ని కవిత్వంలో ఆమెను ప్రోత్సహించిన తీరును వివరించారు. సభాధ్యక్షులు హీరాలాల్‌ మాట్లాడుతూ అవదాన శిరోమణి డాక్టర్‌ ఆశావాదికి కళారత్న అవార్డు రావడం సంతోషించదగిన విషమని అన్నారు. ప్రస్తుతం వివిధ రంగాల్లో విలువలు భ్రస్టుపట్టిన తరుణంలో విలువలతో కూడి సాహిత్యాన్ని ప్రజలకు అందించే వారు తక్కువని అన్నారు. వారు రచనలతోపాటు నిజజీవితంలో కూడా విలువలతో కూడిన జీవితాన్ని గడిపిన ప్రముఖుడు డాక్టర్‌ ఆశావాది అని కొనియాడారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో 28 అష్టావధానాలు చేశానని చెప్పారు.జిల్లాతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని , జిల్లా ప్రముఖ కవుల విశేషాలను ఈసందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు , సమావేశాలలో పాల్గొని సాహితీ మిత్రులను, శిష్యులను పొందానని స్నేహసంపద చాలా గొప్పదని చెప్పారు. ఆస్నేహాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమని అన్నారు. సమాజం పట్ల నిరంతర పరిశీలనా కవులకు, రచయితలకు అవసరమని సూచించారు. ఏ కవి పద్యాలు ప్రజల నోళ్లలో మెదులుతాయే అలాంటి వారే ప్రముఖులని చెప్పారు. కళలను గురించి వివరిస్తూ ఏది ధనాపేక్ష లేకుండా ఉండేదే నిజమైన కళ అన్నారు. సన్మాన పత్రాన్ని అధ్యాపకులు వేణుగోపాలశర్మ చదివి వినిపించారు. రిటైర్డ్‌ అధ్యాపకులు కాల్వసంజీవరాయుడు, జానపదకవి గిరిరాజులు, రోశయ్య, శశిధర్‌రావు తదితరులు మాట్లాడారు. గ్రంధాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ కె.జి గంగాధరరెడ్డి, సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ ప్రత్యేక జ్ఞాపికను అంజేపి సన్మానించారు.

20, మే 2012, ఆదివారం

ప్రపంచీకరణ దుష్పరిణామాలపై మేల్కొలపాలి

                                              'విన్యాసం' పుస్తకావిష్కరణ సభలో సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు తెలకపల్లి రవి

        ప్రపంచీకరణ దుష్పరిణామాలపై ప్రజలను మేల్కోలిపేలా తమ రచనల ద్వారా కృషి చేయాలని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు తెలకపల్లి రవి సాహితీవేత్తలను కోరారు. ఆదివారం కర్నూలు ఎంపిపి హాల్‌లో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో కెంగార మోహన్‌ రచించిన 'విన్యాసం' పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధులుగా సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు తెలకపల్లి రవి, జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ పి. బుచ్చన్న, అథితులుగా సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు వల్లబాపురం జనార్ధన్‌, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలకపల్లి రవి మాట్లాడుతూ సామాజిక ప్రయోజనం కోరేది సాహిత్యమని, సాహిత్యం ప్రజలకు చేరువ కావాలంటే విస్తృతంగా సమాజ హితం కోరే రచనలు రావాలని ఆకాక్షించారు. ప్రపంచీకరణలో మనిషి నుంచి మనిషి దూరమయ్యారని పేర్కొన్నారు. నైతిక, మానవతా విలువలు తగ్గిపోయి మనిషి వ్యాపార వస్తువుగా మారిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ జీవితంపై సరళీకరణ ప్రభావం గరిలీకరణగా మారిందన్నారు. దేశం అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు పాలకులు చెబుతున్నా మరోపక్క అన్నార్థులు సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో శత కోటీశ్వరులు, పెట్టుబడిదారులకు స్వేచ్చ తప్ప కార్మికులకు, రైతులకు, పేదలకు మాత్రం కాదన్నారు. ప్రపంచీకరణ పేరుతో సాగుతున్న ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దురాక్రమణపైన, చొరుబాటు పైనా ఇలాంటి కవితా విన్యాసం చేయడం అవసరమన్నారు. ఈ ప్రాంతంలో ప్రగతిశీల సాహిత్యాన్ని పెంపొందించాలన్నారు. రాయలసీమ ఫ్యాక్షన్‌ మీద సినిమాలు చూపించి ఇక్కడ ప్రజా బతుకులను దుర్బర జీవితాలను తెరమరుగుపరుస్తున్నారు. హంద్రీనదీ తీరానా కవితా పుష్పాల్లా అనేక మంది కవులు, కళాకారులు వికసించాలని రవి అభిప్రాయపడ్డారు. అనంతరం డిఇఒ డాక్టర్‌ బుచ్చన్న మాట్లాడుతూ విష సంస్కృతి కోరల్లో మన కుటుంబాలు నలిగిపోతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. తల్లి, చెల్లి అక్క, అన్న కూర్చోని వీక్షించలేని కార్యక్రమాలు టివిలో వస్తుంటే, చూడలేని దౌర్భాగ్యమైన స్థితి ఉందన్నారు. సామాజిక కోణాన్ని ఆవిష్కరించిన విన్యాసం కవితా సంపుటి అందరికీ ఆదర్శమన్నారు. పిల్లలు సక్రమమైన మార్గంలో నడిచేందుకు ఉపాధ్యాయులు కవితలను ప్రోత్సహించాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు వల్లాబాపురం జనార్ధన మాట్లాడుతూ విన్యాసం కవితా సంపుటిలో మనిషి ఎదుర్కొంటున్న సమస్యలు, సమకాలిన సంగతులు ప్రత్యక్షంగా కనిపిస్తాయన్నారు. మనిషికి మనిషికి దూరం పెరిగినప్పుడు దగ్గరచేసేది సాహిత్యమన్నారు. యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి కె. సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులు సాహిత్య రంగంలో రానించడం అభినందనీయమన్నారు. కవి కెంగార మోహన్‌ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆధునీకతలో మనిషి మోసపోతున్న తీరు ఈ విన్యాసం కవితా సంపుటిలో ఉన్నాయన్నారు. ఇక ముందు సామాజిక అంశాలపై కవిత్వం రచిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఈ పుస్తకాన్ని తెలకపల్లి నరసింహయ్యకు అంకితమిచ్చారు. అంతకు ముందు తెలకపల్లి రవి పుస్తకావిష్కరణ చేశారు. అనంతరం కవి కెంగార మోహన్‌ను ఘనంగా పలువురు సన్మానించారు. ప్రంపంచీకరణ నేపథ్యంలో మోహన్‌ రచించిన 'విన్యాసం' కవితా సంపుటి బాగుందని పలువురు అభినందించారు. పలువురు సాహితీ వేత్తలు, సాహిత్యాభిమానులు హాజరయ్యారు.

22, మార్చి 2012, గురువారం

ఉగాదితో శ్రీశ్రీ అనుబంధం

             ఖరనామ సంవత్సరం తీపి, చేదుల్ని మిగిల్చి నందననామ సంవత్సరానికి స్వాగతం పలుకుతోంది. అచ్చమైన పదహారణాల తెలుగువెలుగుకు చక్కటి నిదర్శనం ఉగాది. తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ నివసిస్తున్నా సంప్రదాయబద్ధంగా తెలుగుదనం ఉట్టిపడేలా జరుపుకోవడం ఆనవాయితీ. మారుతున్న సమాజంలో మార్పు ఎంత అనివార్యమైనా తెలుగు సంవత్సరానికి స్వాగతం పలకడం సహజం. పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, మామిడి తోరణాలతో ఉగాదిని స్వాగతిస్తాం. కవి సమ్మేళనాలతో తెలుగుభాషకు పట్టాభిషేకం చేస్తాం. ఇంతటి విశిష్టత ఉన్న ఉగాదిని మహాకవి శ్రీశ్రీ తన కవితల్లో విభిన్న రీతుల్లో సామాజిక స్పృహను జోడించి స్వాగతం పలికారు. ఉగాది నాటి అనుభూతుల్ని అనుభావాలతో కలిపి కొత్త సిరాతో అక్షర విన్యాసం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఉగాది సందర్భంగా ఒక్కోసారి ఒక్కోవిధంగా స్వాగతం పలుకుతూ సామాన్యుడి జీవనానికి దగ్గరగా కవిత్వీకరించారు. శ్రమైక జీవన సౌందర్యానికి సాహిత్య స్థానం ఆయనతోనే సాధ్యమైంది.
''ఈ నూతన సంవత్సరం
నవచేతన సంపత్కరము
యువజీవన శోభావహము
కవితామయ బృందావనము''
అంటూ ఉగాదిని స్వాగతించారు. మానవ జీవితాన్ని మానవీయ విలువలతో కలగలిపి కొత్త టానిక్‌ను తయారుచేసి సమాజానికి అందించారు. రుతువులతో మాట్లాడించడం, తిథులు, నక్షత్రాలతో సాహిత్యాన్ని సృష్టించడం ఆయనకే సొంతం.
''ఇదిగో ఇంకో ఏడాది
ఎవరిదీ ఉగాది?
అడగాలా? ఇది నీదీ నాదీ
మన భావి సుఖాల పునాది''
వంటి సామాజిన స్పృహ కలిగిన గీతాలతో భాషా సాహిత్యాలను ప్రజలకు చేరువ చేయడం ఎవరికి సాధ్యమవుతుంది. శ్రీశ్రీ భాషలోని అంతర్లీన భావాలు, బహిర్గత భావనలు తెలుగు భాషకు జీవం పోశారు.
''ఈ ఉగాది మనకిచ్చేదేది
రోజురోజుకి తెచ్చేదేది
అని వైరాగ్యం ప్రకటిస్తూనే
రోజూ సూర్యున్ని తెస్తుంది''
అంటూ వాసంతిక ఎవరిదీ ఉగాది అనే యుగళ గీతిలో విశ్లేషిస్తారు. సాధారణ కవిగా ఉంటూనే అసాధారణ సాహిత్యాన్ని సృష్టించి ప్రాపంచిక దృక్పథాన్ని ప్రకటించారు. ప్రపంచంలో ఏమూల, ఏ సంఘటన జరిగినా మొదట స్పందించి అక్షర నీరాజనం అందించే మహోన్నత కవి శ్రీశ్రీ.
''ప్రతీక్షణం అనేక మంది పుడుతున్నారు
ప్రతీ దినం అనేక మంది వెడుతున్నారు
గతించినట్టివారి వంతు పావు కాగితం
జనించినట్టి వారి హక్కు గొప్ప స్వాగతం
ఉగాది దేవరా...''
అంటూ ఉగాది దేవర కవితలో విశ్లేషించి వీర వియాత్నం విముక్తి సైన్యాలకు అంకితమిచ్చారు. కష్టజీవికి కేరాఫ్‌ అడ్రస్‌ శ్రీశ్రీ అని ప్రతి సాహితీవేత్త అనడం కొత్తేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుభాషలో ఏ సాహిత్య కార్యక్రమం జరిగినా శ్రీశ్రీ పేరు ఉచ్ఛరించకుండా కవితల్ని జ్ఞప్తికి తెచ్చుకోకుండా కార్యక్రమం చేస్తే అది ఉప్పులేని వంటకమే. ఉగాది కవి సమ్మేళాన్ని ఈ కింది విధంగా స్వాగతిస్తారు.
''ఉగాది కవి సమ్మేళన
శుభోదయావసరాన
సౌమ్యనామ వర్షానికి
స్వాగతమగు సమయాన''
అంటూ సౌమ్యవాది మ్యానిఫెస్టో కవితలో చెబుతారు. ఈ కవితలో తిరుగుబాటు, చాదస్తం, మానవ స్వాభవం అన్నీ విశ్లేషిస్తూనే..
''మానవులంతా ఒకటని
మనిషి గ్రహించే సుదినం
ఇంతట్లో వచ్చే సూ
చన లేవి కానరావనే''
ఆవేదన చెందుతారాయన. సహజంగా కవిత్వంలో ఉగాది పచ్చడిని వర్ణిస్తూ చేదు, తీపి, పులుపుల కలయికలను, రుతువులను చెప్పడం జరుగుతుంది. కానీ శ్రీశ్రీ అలా కాదు.
''ఎలాగుంది ఉగాది పచ్చడి అని అంటారా
ఓ భేషుగ్గా ఉంది
పత్రిక పొట్లంలోని పాత సాహిత్యం కన్నా బాగానే ఉంది
కొంచెం తియ్యగా ఉంది
చాలా చేదుగా ఉంది
మొత్తం మీద మన జీవితాల్లాగా ఉందంటారు''
ఈరోజు ప్రాంతీయ ఉద్యమాల పేరుతో తెలుగు ప్రజల్ని, భాషా సాహిత్యాలను వేరు చేసే ప్రయత్నాలు ఆరంభించి రాజకీయ పబ్బం గడుపుకునే రోజులొచ్చాయి. వీటిని ఆనాడే తీవ్రంగా వ్యతిరేకించారాయన.
''తెలుగు జాతిని శిలువ తీస్తున్న
తెలుగు ఖ్యాతిని నలుపు చేస్తున్న
విశాలాంధ్రను చీల్చచూస్తున్న
పిశాచాలను తరిమి వేస్తున్నా''
అంటూ ఘాటుగా ఉగాది గీతిలో కవితలో గర్జిస్తారు.
ఎన్నో కవితలు రాసి ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న శ్రీశ్రీకి తెలుగుపై మమకారం ఉగాది నాడు ఈ విధంగా చూపిస్తారు.
''తెలుగువాడి తెలుగు 'వాడి'
దీపించాలి.
తెలుగునాట తెలుగుపాట
వ్యాపించాలి
తమ గమ్యం
చేరాలంతే
ఈ ఉగాది వేళ నేను కోరేదింతే''
అన్నారు. ఎన్నో అభిప్రాయాలు ఉగాదిపై చెప్పినా ప్రత్యక్షంగా ఉగాది పండుగపై సామాన్యుడికున్న అభిప్రాయం చెప్పేందుకే ప్రయత్నిస్తారు.
''ఎన్ని ఉగాదులు రాలేదు ఇం
కెన్ని ఉగాదులు పోలేదు
ఎక్కడి దొంగలు అక్కడే
ఎక్కడి గొంగళి అక్కడే''
అంటు ఉగాది స్వగతం కవితలో కపట రాజకీయాలను తిడుతూనే ఉగాది గీతంలో
''ఈ ఉగాది మహోదయ వేళ
ఈ వసంత నవోదయ వేళ
విప్లవ శంఖం పూరించుదాం
విజయ దుందుభి మ్రోగించుదాం''
అంటూ ముగిస్తారాయన.
కెంగార మోహన్‌ - సాహితీ స్రవంతి కర్నూలు జిల్లా కార్యదర్శి

7, మార్చి 2012, బుధవారం

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

                   మహిళల హక్కుల కోసం స్త్రీలంతా ఏకమై వందేళ్లక్రితం జరిగిన పోరాటం సాక్షిగా మహిళాదినోత్సవం ప్రంపంచ వ్యాప్తంగా మార్చి 8న జరుపుకోవడం మొదలైంది. 1911 సంవత్సరంలో ఆనాటి మహిళలు రగిల్చిన స్ఫూర్తి ఎందరో మహిళల్లో ధైర్యాన్ని నింపింది. వందేళ్లక్రితమే మహిళలు పోరాడి అనుకున్నది సాధించారు. నేటిస్త్రీ చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ ముందుంది. ఏ రంగంలోనైనా ముందుకు పోగలనని నిరూపించుకుంది. అన్నింటా ధీటుగా సమర్థవంతంగా రాణించి తన ప్రత్యేకతను నిలుపుకుంటోంది. అయినా సమాజంలో సమాన గౌరవాన్ని గుర్తింపును పొందలేక పోతున్నారు. నేటికీ మహిళలపై అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు, జరుగుతూనే ఉన్నాయి. యాసిడ్‌ దాడులు, గృహహింస, కట్నపిశాచి, భ్రూణహత్యల పేరిట వారికి అబధ్రత ఎదురవుతూనే ఉంది. స్త్రీని సమాజం ఇప్పటికీ వ్యక్తిత్వం గలదిగా , ఇష్టాఇష్టాలు, అభిప్రాయాలు గల వ్యక్తిగా గుర్తించడం లేదు. విచిత్రం ఏమిటంటే ... రాజకీయాల్లో , వ్యాపారరంగంలో , ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఇంటా బయట, ఎక్కడైనా ఆమె శక్తి సామర్థ్యాలు గుర్తిస్తున్నట్లే ఉంటుంది. నిజానికది స్త్రీని సమాజం తమకు అనువుగా వినియోగించుకోవడం తప్ప ఆమెకు సమాన హోదా ఇవ్వడం కాదు. ఇన్ని ప్రతి కూల పరిస్థితుల్లోనూ వ్యక్తిగా నిలదొక్కుకోవాలన్న ఆమె ఆకాంక్షను అణచి వేయడానికి జరుగుతున్న యత్నాలు అనేకం. అవేనేడు ఆమెను వెనక్కు పట్టి లాగుతున్నాయి. సంస్కృతి, సంప్రదాయాల పేరిట ఆమెను చట్రాల్లో పట్టి బందిస్తున్నాయి. పురుషాధిక్య సమాజంలో ఇంతకుమించిన న్యాయం జరుగుతుందన్న ఆశలు లేవు. మరి పరిష్కారం? అందుకు స్త్రీలే పూనుకోవాలి. వివక్షను సవాలు చేయాలి. తమ అస్తిత్వాన్ని నిరూపించుకోవాలి. సవాళ్లకు సరయిన రీతిలో సమాధానమివ్వాలి. సాటి మహిళలందరినీ కూడగట్టుకోవాలి. సమస్యలపై సమరశంఖం పూరించాలి. సమైక్య నినాదాన్ని ప్రతిధ్వనింపజేయాలి. సాధికారతను స్వాధీనం చేసుకోవాలి.
ఈ జన్మ ఎంత గొప్పదో...
         స్త్రీగా పుట్టినందుకు ఎంత సంతోషించాలి....ఎంతో గర్వపడాలి. పెద్దలను ఎలా గౌరవించాలో , పిల్లలను ఎలా లాలించాలో , సాటి వారిని ఎలా ప్రేమించాలో తను చేసి నాకు ఎంతో ఆదర్శప్రాయమైంది అమ్మ. గిల్లి గజ్జాలు పెట్టుకున్నా. పరుశమైన మాటనోటి వెంట వచ్చినా అదెంత తప్పో చెప్పి మందలించి మంచి మాట చెప్పింది అమ్మ. అందరితో కలిసి పోతూ నవ్వుతూ బేషిజాలు లేకుండా స్నేహాన్ని పంచి ఇవ్వడం నేర్పింది నాకు అమ్మ. జీవితంలో ఎలా ఉండాలో నేర్పిన అమ్మతనం ఎంత గొప్పదో... ఆడజన్మ ఎంత గొప్పదో....

5, మార్చి 2012, సోమవారం

రాష్ట్రీయ ఆరోగ్యనిధిని సద్వినియోగం చేసుకోవాలి

20 సూత్రాల పథకం ఛైర్మన్‌ తులసిరెడ్డి
             క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్రీయ ఆరోగ్య నిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని 20 సూత్రాల పథకం ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌ తులసీరెడ్డి సూచించారు. ప్రెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో రాయలసీమ యూనివర్శిటీలో రెండ్రోజులుగా జరిగిన విలేకరుల శిక్షణా సమావేశం సోమవా రం ముగిసింది. కార్యక్రమంలో తులసీరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డారు. క్యాన్సర్‌ వ్యాధికి గురైన గ్రామీణ నిరుపేద లు రూ.2లక్షలు రీయింబర్స్‌ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని గ్రామీణ విలేకరులు వ్యాధిగ్రస్తుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
సమాజానికి మీడియా ప్రాణవాయువు
           ప్రజాస్వామ్యానికి మీడియా ప్రాణవాయువని తులసీరెడ్డి తెలిపారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న విలేకరులు నిరంతర విద్యార్థుల్లా ఉండాలని సూచించారు. సమాజంలో వస్తున్న మార్పులను నిరంతర అధ్యయం చేస్తూ వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ప్రభుత్వ పథకాల పనితీరుతో పాటు వాటి అమలు విధానంపై ప్రెస్‌ అకాడమీ గ్రామీణ విలేకరుల్లో అవగాహన కల్పించడానికి కృషి చేస్తోందన్నారు. తిరుమలగిరిసురేందర్‌ కృషిని అభినందించారు. మెరుగైన సమాజం కోసం మీడియా కృషి చేయాలని కోరారు. అనంతరం ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ తిరుమలగిరి సురేందర్‌ మాట్లాడారు. గతంలో 'సమాచార హక్కు చట్టం-గ్రామీణ విలేకరుల పాత్ర' అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కలెక్టర్‌ రాంశంకర్‌ నాయక్‌ మాట్లాడుతూ మీడియా రాజకీయ రంగంపైనే కాక ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, సామాజిక రంగాలపైనా దృష్టి కేంద్రీకరించాలని కోరారు. రాయలసీమ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సిలర్‌ కృష్ణానాయక్‌, రిజిస్ట్రార్‌ ఎన్‌టికె నాయక్‌, ప్రెస్‌ కౌన్సిల్‌ సభ్యులు తిలక్‌ మాట్లాడారు.

సమాజాన్ని మేల్కొలిపేలా వార్తలు రాయాలి

గ్రామీణ విలేకరులకు ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ తిరుమలగిరి సురేందర్‌సూచన
            సమాజాన్ని మేల్కొలిపే విధంగా విలేకర్లు వార్తలను రాయాలని ఎపి ప్రెస్‌ అకాడమీ ఛైర్మెన్‌ తిరుమలగిరి సురేందర్‌ కోరారు. 2012 మార్చి 4,5 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు నగర శివార్లలోని రాయలసీమ విశ్వవిద్యాలయం, ఎపి ప్రెస్‌ ఆకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ విలేకరులకు రెండు రోజుల శిక్షణా తరగతుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ప్రెస్‌ అకాడమీ ఛైర్మెన్‌ సురేందర్‌ హాజరయ్యారు. అథితులుగా కలెక్టర్‌ రాంశంకర్‌నాయక్‌, ఆర్‌యువిసి కృష్ణానాయక్‌, ఏఎస్పీ పద్మాకర్‌రావు, రిజిస్ట్రార్‌ ఎన్‌టికె నాయక్‌, ప్రెస్‌ అకాడమీ పాలక మండలి సభ్యులు కెబిజి తిలక్‌, డిపిఆర్‌ఓ తిమ్మప్ప పాల్గొన్నారు. మొదట జ్యోతిని వెలిగించి ముఖ్యఅతిథులు శిక్షణా తరగతులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రెస్‌ అకాడమీ ఛైర్మెన్‌ సురేందర్‌ మాట్లాడారు. ఇప్పటి వరకూ 15 శిక్షణా శిబిరాలను పూర్తి చేసి 16వది కర్నూలులో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. పత్రికా రంగం వృత్తిలో నైపుణ్య విలువలు పెంపొందిం చేందుకు గ్రామీణ విలేకరులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని సమాజాభివృద్ధికి పాటుపడేవిధంగా వార్తలను సేకరించి ప్రజలకు అందిం చాలని ఆయన కోరారు. కలెక్టర్‌ రాంశంకర్‌నాయక్‌ మాట్లాడుతూ భారతరాజ్యాంగంలో పత్రికా రంగానికి ప్రధాన గుర్తింపు ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పత్రికలు బాధ్యతా యుతంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని కోరారు. సమాజ అభివృద్ధికి పాటుపడే విధంగా విలేకరులు వార్తలు రాయాలని సూచించారు. ఆర్‌యువిసి కృష్ణానాయక్‌ మాట్లాడుతూ పత్రికలు ప్రస్తుతం సమాజ అభివృద్ధికి దోహదపడే విధంగా కృషి చేయాలని కోరారు. పరిశోధనాత్మక వార్తలు, ప్రభుత్వ పథకాలు, మీడియా భాష, తదితర అంశాలపై లెక్చరర్లు విలేకరులకు శిక్షణను అందజేశారు.

2, మార్చి 2012, శుక్రవారం

ప్రజాచైతన్య కరదీపిక పుస్తక సాహిత్యం

ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ పంపాదకులు తెలకపల్లి రవి
          పుస్తకసాహిత్యం ప్రజాచైతన్య కరదీపికలా అసమానతలతో కూడిన వ్యవస్థను ప్రతిఘటించేలా ఉపయోగపడాలని ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ సంపాదకులు తెలకపల్లి రవి అన్నారు.ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కేంద్రం కొత్తబస్టాండు సమీపంలోని సుందరయ్య జంక్షన్‌ మార్కెట్‌ యార్డు మినీకాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ప్రజాశక్తి బుకహేౌస్‌ను శుక్రవారం సిపిఎం సీనియర్‌ నాయకులు టి.నరసింహయ్య ప్రారంభించారు. ప్రజాశక్తి కర్నూలు ఎడిషన్‌ మేనేజర్‌ ఎ.వెంకటేష్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభలో రవి ముఖ్యోపన్యాసం చేశారు. అభ్యుదయ సాహిత్యాన్ని, శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించేలా ప్రజాశక్తి బుకహేౌస్‌ పని చేస్తుందని చెప్పారు. మానవ మస్తిస్కాలకు పదును పెట్టే గ్రంథాలయాలు శిథిలావస్థకు చేరాయన్నారు. గ్రంథాలయాల్లో పని చేసే ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా అందడం లేదన్నారు. అనంతరం సీనియర్‌ నాయకులు నరసింహయ్య మాట్లాడుతూ నవశక్తి, విశాలాంధ్ర, జనశక్తిగా రూపాంతరం చెందుతూ ప్రజాశక్తిగా మారిందన్నారు. ప్రజాశక్తితో తనకు చాలా అనుబంధముందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌ మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే సాహిత్య కేంద్రంగా ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ ఉండాలన్నారు. మార్క్సిస్టు సాహిత్యంతోపాటు సమాజ పరిణామం, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అందించే పుస్తకాలు జిల్లా ప్రజలకు అందించా లని ఆకాంక్షించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎన్‌ లలిత మాట్లాడుతూ ప్రజల అభివృద్ధ్ధికి అనుగుణంగా ఉపయోగపడే అన్ని రకాల పుస్తకాలను ప్రజాశక్తి బుకహేౌస్‌లో ఉంచాలని సూచించారు. అభ్యుదయ సాహిత్యంతో పాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు కావల్సిన పుస్తకాలను కూడా అందుబాటులో ఉంచాలని కోరారు. లలిత కళాసమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, ఉస్మానియా కళా శాల విశ్రాంత అధ్యా పకులు వెంకట్రామిరెడ్డి, ప్రజాశక్తి ఎడిషన్‌ ఇన్‌చార్జి పి చంద్రయ్య, జిల్లా కన్వీనర్‌ ఎం.రాజు పాల్గొన్నారు.

27, ఫిబ్రవరి 2012, సోమవారం

నాలుగు స్థానాల్లో పోటీలో ఉంటాం

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు
               ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగు స్థానాల్లో పోటీలో ఉంటామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. రాష్ట్రంలో ఏడు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయని, అందులో సిపిఎం నాలుగు స్థానాల్లో పోటీ చేస్తోందన్నారు. ఉప ఎన్నికల్లో ప్రజలను ఓటు అడిగే హక్కు సిపిఎంకు మాత్రమే ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి జొన్నలగడ్డ వెంకమరాజు సోమవారం నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమంలో రాఘవులు పాల్గొన్నారు. దీంతో మీడియా వింత ప్రచారం చేస్తోందనీ, టిడిపికి సిపిఎం ఝలక్‌ ఇచ్చిందనీ, 2014 ఎన్నికల్లో కలవరని ప్రచారం చేస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పార్టీ పోటీకి దిగిందని చెప్పారు. మిగతా రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలను విస్మరించాయని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు. పార్టీ నిర్ణయం మేరకు ప్రస్తుతం పోటీచేస్తున్నామన్నారు ప్రకాశ్‌ కరత్‌తో చంద్రబాబు మాట్లాడి పోటీనుండి ఉపసంహరించుకునేలా చేస్తారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ, తమ పార్టీలో నాయకులను మేనేజ్‌ చేసే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగులు, రైతులు, దళితులు అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉంటే చంద్రబాబు తల్లికి రూ.50 లక్షలు ఎలా వచ్చాయనీ, కెసిఆర్‌కు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయనే విషయాల చుట్టే రాజకీయాలను నడుపుతున్నారన్నారు. అధికార పార్టీ నాయకులు మద్యం ముడుపుల కేసుల్లో ఉన్నారని, టిడిపి కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటోందన్నారు. ఏప్రిల్‌ నుండి రాష్ట్రంలో 4900 కోట్ల విద్యుత్‌ ఛార్జీలు, ఇంధన సర్‌ఛార్జీల కింద మరో 10 వేల కోట్ల రూపాయలు భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. మళ్లీ విద్యుత్‌ ఛార్జీలు పెంచితే ఉద్యమం మహోధృతంగా ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వానికి మద్యం ద్వారా 14 వేల కోట్ల రూపాయల పన్నులు వస్తున్నాయని, ప్రజా ప్రతినిధులకు లక్షలాది రూపాయలు మద్యం సిండికేట్ల నుంచి ముడుపులు అందుతున్నాయని అన్నారు. ప్రభుత్వానికి దమ్మూ, ధైర్యం ఉంటే మహిళల ఆమోదం తీసుకుని ఆయా గ్రామాల్లో మద్యం షాపులు పెట్టాలన్నారు. 104, 108 గ్రామ సేవకులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఐకెపి, మధ్యాహ్న భోజన కార్మికులు చేస్తున్న ఆందోళనలకు తమ పార్టీ మద్దతిస్తోందన్నారు. మరే ఇతర రాజకీయ పార్టీ వారికి మద్దతు తెలపలేదని, అలాంటప్పుడు వారికి ఓట్లేందుకు వేయాలని ప్రశ్నించారు. సిపిఎం విజయం సాధిస్తే అన్ని ప్రజా సమస్యలు చర్చకొస్తాయనీ, పరిష్కారానికీ నోచుకుంటాయనీ అన్నారు. సభలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జక్కా వెంకయ్య, జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి.పి.భానురాజు, ఎం.మోహన్‌రావు, పి.శ్రీరాములు, మాదాల వెంకటేశ్వర్లు, పి.చంద్రమౌళి తదితరులున్నారు.
కొల్లాపూర్‌ సిపిఎం అభ్యర్థి ఎండి జబ్బార్‌ నామినేషన్‌
          మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థిగా ఎం డి జబ్బార్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. కొల్లాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఎన్నికల అధికారికి మధ్యాహ్నం నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కొల్లాపూర్‌ పట్టణంలోని పెట్రోలు బంకు నుండి బస్టాండ్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, వై.వెంకటేశ్వర్‌రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జాన్‌వెస్లీ, టి.సాగర్‌, జిల్లా కార్యదర్శి కిల్లె గోపాల్‌, సీనియర్‌ నాయకులు వనగంటి ఈశ్వర్‌ ప్రదర్శన అగ్రభాగాన నడిచారు. డప్పువాయిద్యకారులు, కళానృత్యాలతో కళాకారులు ముందు రాగా కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ మార్చి 18న జరిగే ఉప ఎన్నికల్లో ప్రజల పక్షాన నిలబడి పని చేస్తున్న సిపిఎం అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. పూర్తి స్థాయిలో శాసనసభ సమావేశాలు జరిగితే సభ్యుల అవినీతి చిట్టా బయటపడుతుందని, సమావేశాలు పూర్తికాకుండా అడ్డు తగులుతున్నారని విమర్శించారు. ప్రజాసమస్యలు పట్టించుకోకుండా అవినీతికి పాల్పడుతున్న అభివృద్ధి నిరోధకులను ఓడించాలన్నారు. 30 ఏళ్లుగా ప్రజాతంత్ర ఉద్యమంలో కార్మిక, కర్షక, ఉద్యోగ, విద్యార్థి, యువజన పక్షాన పనిచేస్తున్న ఎం.డి జబ్బార్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కొల్లాపూర్‌లో రెండు పర్యాయాలు మంత్రిగా పని చేసిన జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్‌ ప్రాంత ప్రజలకు రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేకపోయారని విమర్శించారు.
ఆకట్టుకున్న భారీ ర్యాలీ
        జొన్నలగడ్డ వెంకమరాజు నామినేషన్‌ సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరు ఎర్రబారింది. కోవూరు పట్టణంలో అభ్యర్థితో పాటు రాఘవులు, జిల్లా కార్యదర్శి రాజగోపాల్‌ ఎడ్లబండిపై ప్రదర్శనగా వచ్చారు. సిపిఎం అభ్యర్థి జొన్నలగడ్డ వెంకమరాజు సోమవారం కోవూరు తహశీల్దారు కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు అందజేశారు.