22, మార్చి 2012, గురువారం

ఉగాదితో శ్రీశ్రీ అనుబంధం

             ఖరనామ సంవత్సరం తీపి, చేదుల్ని మిగిల్చి నందననామ సంవత్సరానికి స్వాగతం పలుకుతోంది. అచ్చమైన పదహారణాల తెలుగువెలుగుకు చక్కటి నిదర్శనం ఉగాది. తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ నివసిస్తున్నా సంప్రదాయబద్ధంగా తెలుగుదనం ఉట్టిపడేలా జరుపుకోవడం ఆనవాయితీ. మారుతున్న సమాజంలో మార్పు ఎంత అనివార్యమైనా తెలుగు సంవత్సరానికి స్వాగతం పలకడం సహజం. పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, మామిడి తోరణాలతో ఉగాదిని స్వాగతిస్తాం. కవి సమ్మేళనాలతో తెలుగుభాషకు పట్టాభిషేకం చేస్తాం. ఇంతటి విశిష్టత ఉన్న ఉగాదిని మహాకవి శ్రీశ్రీ తన కవితల్లో విభిన్న రీతుల్లో సామాజిక స్పృహను జోడించి స్వాగతం పలికారు. ఉగాది నాటి అనుభూతుల్ని అనుభావాలతో కలిపి కొత్త సిరాతో అక్షర విన్యాసం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఉగాది సందర్భంగా ఒక్కోసారి ఒక్కోవిధంగా స్వాగతం పలుకుతూ సామాన్యుడి జీవనానికి దగ్గరగా కవిత్వీకరించారు. శ్రమైక జీవన సౌందర్యానికి సాహిత్య స్థానం ఆయనతోనే సాధ్యమైంది.
''ఈ నూతన సంవత్సరం
నవచేతన సంపత్కరము
యువజీవన శోభావహము
కవితామయ బృందావనము''
అంటూ ఉగాదిని స్వాగతించారు. మానవ జీవితాన్ని మానవీయ విలువలతో కలగలిపి కొత్త టానిక్‌ను తయారుచేసి సమాజానికి అందించారు. రుతువులతో మాట్లాడించడం, తిథులు, నక్షత్రాలతో సాహిత్యాన్ని సృష్టించడం ఆయనకే సొంతం.
''ఇదిగో ఇంకో ఏడాది
ఎవరిదీ ఉగాది?
అడగాలా? ఇది నీదీ నాదీ
మన భావి సుఖాల పునాది''
వంటి సామాజిన స్పృహ కలిగిన గీతాలతో భాషా సాహిత్యాలను ప్రజలకు చేరువ చేయడం ఎవరికి సాధ్యమవుతుంది. శ్రీశ్రీ భాషలోని అంతర్లీన భావాలు, బహిర్గత భావనలు తెలుగు భాషకు జీవం పోశారు.
''ఈ ఉగాది మనకిచ్చేదేది
రోజురోజుకి తెచ్చేదేది
అని వైరాగ్యం ప్రకటిస్తూనే
రోజూ సూర్యున్ని తెస్తుంది''
అంటూ వాసంతిక ఎవరిదీ ఉగాది అనే యుగళ గీతిలో విశ్లేషిస్తారు. సాధారణ కవిగా ఉంటూనే అసాధారణ సాహిత్యాన్ని సృష్టించి ప్రాపంచిక దృక్పథాన్ని ప్రకటించారు. ప్రపంచంలో ఏమూల, ఏ సంఘటన జరిగినా మొదట స్పందించి అక్షర నీరాజనం అందించే మహోన్నత కవి శ్రీశ్రీ.
''ప్రతీక్షణం అనేక మంది పుడుతున్నారు
ప్రతీ దినం అనేక మంది వెడుతున్నారు
గతించినట్టివారి వంతు పావు కాగితం
జనించినట్టి వారి హక్కు గొప్ప స్వాగతం
ఉగాది దేవరా...''
అంటూ ఉగాది దేవర కవితలో విశ్లేషించి వీర వియాత్నం విముక్తి సైన్యాలకు అంకితమిచ్చారు. కష్టజీవికి కేరాఫ్‌ అడ్రస్‌ శ్రీశ్రీ అని ప్రతి సాహితీవేత్త అనడం కొత్తేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుభాషలో ఏ సాహిత్య కార్యక్రమం జరిగినా శ్రీశ్రీ పేరు ఉచ్ఛరించకుండా కవితల్ని జ్ఞప్తికి తెచ్చుకోకుండా కార్యక్రమం చేస్తే అది ఉప్పులేని వంటకమే. ఉగాది కవి సమ్మేళాన్ని ఈ కింది విధంగా స్వాగతిస్తారు.
''ఉగాది కవి సమ్మేళన
శుభోదయావసరాన
సౌమ్యనామ వర్షానికి
స్వాగతమగు సమయాన''
అంటూ సౌమ్యవాది మ్యానిఫెస్టో కవితలో చెబుతారు. ఈ కవితలో తిరుగుబాటు, చాదస్తం, మానవ స్వాభవం అన్నీ విశ్లేషిస్తూనే..
''మానవులంతా ఒకటని
మనిషి గ్రహించే సుదినం
ఇంతట్లో వచ్చే సూ
చన లేవి కానరావనే''
ఆవేదన చెందుతారాయన. సహజంగా కవిత్వంలో ఉగాది పచ్చడిని వర్ణిస్తూ చేదు, తీపి, పులుపుల కలయికలను, రుతువులను చెప్పడం జరుగుతుంది. కానీ శ్రీశ్రీ అలా కాదు.
''ఎలాగుంది ఉగాది పచ్చడి అని అంటారా
ఓ భేషుగ్గా ఉంది
పత్రిక పొట్లంలోని పాత సాహిత్యం కన్నా బాగానే ఉంది
కొంచెం తియ్యగా ఉంది
చాలా చేదుగా ఉంది
మొత్తం మీద మన జీవితాల్లాగా ఉందంటారు''
ఈరోజు ప్రాంతీయ ఉద్యమాల పేరుతో తెలుగు ప్రజల్ని, భాషా సాహిత్యాలను వేరు చేసే ప్రయత్నాలు ఆరంభించి రాజకీయ పబ్బం గడుపుకునే రోజులొచ్చాయి. వీటిని ఆనాడే తీవ్రంగా వ్యతిరేకించారాయన.
''తెలుగు జాతిని శిలువ తీస్తున్న
తెలుగు ఖ్యాతిని నలుపు చేస్తున్న
విశాలాంధ్రను చీల్చచూస్తున్న
పిశాచాలను తరిమి వేస్తున్నా''
అంటూ ఘాటుగా ఉగాది గీతిలో కవితలో గర్జిస్తారు.
ఎన్నో కవితలు రాసి ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న శ్రీశ్రీకి తెలుగుపై మమకారం ఉగాది నాడు ఈ విధంగా చూపిస్తారు.
''తెలుగువాడి తెలుగు 'వాడి'
దీపించాలి.
తెలుగునాట తెలుగుపాట
వ్యాపించాలి
తమ గమ్యం
చేరాలంతే
ఈ ఉగాది వేళ నేను కోరేదింతే''
అన్నారు. ఎన్నో అభిప్రాయాలు ఉగాదిపై చెప్పినా ప్రత్యక్షంగా ఉగాది పండుగపై సామాన్యుడికున్న అభిప్రాయం చెప్పేందుకే ప్రయత్నిస్తారు.
''ఎన్ని ఉగాదులు రాలేదు ఇం
కెన్ని ఉగాదులు పోలేదు
ఎక్కడి దొంగలు అక్కడే
ఎక్కడి గొంగళి అక్కడే''
అంటు ఉగాది స్వగతం కవితలో కపట రాజకీయాలను తిడుతూనే ఉగాది గీతంలో
''ఈ ఉగాది మహోదయ వేళ
ఈ వసంత నవోదయ వేళ
విప్లవ శంఖం పూరించుదాం
విజయ దుందుభి మ్రోగించుదాం''
అంటూ ముగిస్తారాయన.
కెంగార మోహన్‌ - సాహితీ స్రవంతి కర్నూలు జిల్లా కార్యదర్శి

7, మార్చి 2012, బుధవారం

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

                   మహిళల హక్కుల కోసం స్త్రీలంతా ఏకమై వందేళ్లక్రితం జరిగిన పోరాటం సాక్షిగా మహిళాదినోత్సవం ప్రంపంచ వ్యాప్తంగా మార్చి 8న జరుపుకోవడం మొదలైంది. 1911 సంవత్సరంలో ఆనాటి మహిళలు రగిల్చిన స్ఫూర్తి ఎందరో మహిళల్లో ధైర్యాన్ని నింపింది. వందేళ్లక్రితమే మహిళలు పోరాడి అనుకున్నది సాధించారు. నేటిస్త్రీ చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ ముందుంది. ఏ రంగంలోనైనా ముందుకు పోగలనని నిరూపించుకుంది. అన్నింటా ధీటుగా సమర్థవంతంగా రాణించి తన ప్రత్యేకతను నిలుపుకుంటోంది. అయినా సమాజంలో సమాన గౌరవాన్ని గుర్తింపును పొందలేక పోతున్నారు. నేటికీ మహిళలపై అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు, జరుగుతూనే ఉన్నాయి. యాసిడ్‌ దాడులు, గృహహింస, కట్నపిశాచి, భ్రూణహత్యల పేరిట వారికి అబధ్రత ఎదురవుతూనే ఉంది. స్త్రీని సమాజం ఇప్పటికీ వ్యక్తిత్వం గలదిగా , ఇష్టాఇష్టాలు, అభిప్రాయాలు గల వ్యక్తిగా గుర్తించడం లేదు. విచిత్రం ఏమిటంటే ... రాజకీయాల్లో , వ్యాపారరంగంలో , ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఇంటా బయట, ఎక్కడైనా ఆమె శక్తి సామర్థ్యాలు గుర్తిస్తున్నట్లే ఉంటుంది. నిజానికది స్త్రీని సమాజం తమకు అనువుగా వినియోగించుకోవడం తప్ప ఆమెకు సమాన హోదా ఇవ్వడం కాదు. ఇన్ని ప్రతి కూల పరిస్థితుల్లోనూ వ్యక్తిగా నిలదొక్కుకోవాలన్న ఆమె ఆకాంక్షను అణచి వేయడానికి జరుగుతున్న యత్నాలు అనేకం. అవేనేడు ఆమెను వెనక్కు పట్టి లాగుతున్నాయి. సంస్కృతి, సంప్రదాయాల పేరిట ఆమెను చట్రాల్లో పట్టి బందిస్తున్నాయి. పురుషాధిక్య సమాజంలో ఇంతకుమించిన న్యాయం జరుగుతుందన్న ఆశలు లేవు. మరి పరిష్కారం? అందుకు స్త్రీలే పూనుకోవాలి. వివక్షను సవాలు చేయాలి. తమ అస్తిత్వాన్ని నిరూపించుకోవాలి. సవాళ్లకు సరయిన రీతిలో సమాధానమివ్వాలి. సాటి మహిళలందరినీ కూడగట్టుకోవాలి. సమస్యలపై సమరశంఖం పూరించాలి. సమైక్య నినాదాన్ని ప్రతిధ్వనింపజేయాలి. సాధికారతను స్వాధీనం చేసుకోవాలి.
ఈ జన్మ ఎంత గొప్పదో...
         స్త్రీగా పుట్టినందుకు ఎంత సంతోషించాలి....ఎంతో గర్వపడాలి. పెద్దలను ఎలా గౌరవించాలో , పిల్లలను ఎలా లాలించాలో , సాటి వారిని ఎలా ప్రేమించాలో తను చేసి నాకు ఎంతో ఆదర్శప్రాయమైంది అమ్మ. గిల్లి గజ్జాలు పెట్టుకున్నా. పరుశమైన మాటనోటి వెంట వచ్చినా అదెంత తప్పో చెప్పి మందలించి మంచి మాట చెప్పింది అమ్మ. అందరితో కలిసి పోతూ నవ్వుతూ బేషిజాలు లేకుండా స్నేహాన్ని పంచి ఇవ్వడం నేర్పింది నాకు అమ్మ. జీవితంలో ఎలా ఉండాలో నేర్పిన అమ్మతనం ఎంత గొప్పదో... ఆడజన్మ ఎంత గొప్పదో....

5, మార్చి 2012, సోమవారం

రాష్ట్రీయ ఆరోగ్యనిధిని సద్వినియోగం చేసుకోవాలి

20 సూత్రాల పథకం ఛైర్మన్‌ తులసిరెడ్డి
             క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్రీయ ఆరోగ్య నిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని 20 సూత్రాల పథకం ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌ తులసీరెడ్డి సూచించారు. ప్రెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో రాయలసీమ యూనివర్శిటీలో రెండ్రోజులుగా జరిగిన విలేకరుల శిక్షణా సమావేశం సోమవా రం ముగిసింది. కార్యక్రమంలో తులసీరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డారు. క్యాన్సర్‌ వ్యాధికి గురైన గ్రామీణ నిరుపేద లు రూ.2లక్షలు రీయింబర్స్‌ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని గ్రామీణ విలేకరులు వ్యాధిగ్రస్తుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
సమాజానికి మీడియా ప్రాణవాయువు
           ప్రజాస్వామ్యానికి మీడియా ప్రాణవాయువని తులసీరెడ్డి తెలిపారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న విలేకరులు నిరంతర విద్యార్థుల్లా ఉండాలని సూచించారు. సమాజంలో వస్తున్న మార్పులను నిరంతర అధ్యయం చేస్తూ వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ప్రభుత్వ పథకాల పనితీరుతో పాటు వాటి అమలు విధానంపై ప్రెస్‌ అకాడమీ గ్రామీణ విలేకరుల్లో అవగాహన కల్పించడానికి కృషి చేస్తోందన్నారు. తిరుమలగిరిసురేందర్‌ కృషిని అభినందించారు. మెరుగైన సమాజం కోసం మీడియా కృషి చేయాలని కోరారు. అనంతరం ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ తిరుమలగిరి సురేందర్‌ మాట్లాడారు. గతంలో 'సమాచార హక్కు చట్టం-గ్రామీణ విలేకరుల పాత్ర' అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కలెక్టర్‌ రాంశంకర్‌ నాయక్‌ మాట్లాడుతూ మీడియా రాజకీయ రంగంపైనే కాక ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, సామాజిక రంగాలపైనా దృష్టి కేంద్రీకరించాలని కోరారు. రాయలసీమ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సిలర్‌ కృష్ణానాయక్‌, రిజిస్ట్రార్‌ ఎన్‌టికె నాయక్‌, ప్రెస్‌ కౌన్సిల్‌ సభ్యులు తిలక్‌ మాట్లాడారు.

సమాజాన్ని మేల్కొలిపేలా వార్తలు రాయాలి

గ్రామీణ విలేకరులకు ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ తిరుమలగిరి సురేందర్‌సూచన
            సమాజాన్ని మేల్కొలిపే విధంగా విలేకర్లు వార్తలను రాయాలని ఎపి ప్రెస్‌ అకాడమీ ఛైర్మెన్‌ తిరుమలగిరి సురేందర్‌ కోరారు. 2012 మార్చి 4,5 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు నగర శివార్లలోని రాయలసీమ విశ్వవిద్యాలయం, ఎపి ప్రెస్‌ ఆకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ విలేకరులకు రెండు రోజుల శిక్షణా తరగతుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ప్రెస్‌ అకాడమీ ఛైర్మెన్‌ సురేందర్‌ హాజరయ్యారు. అథితులుగా కలెక్టర్‌ రాంశంకర్‌నాయక్‌, ఆర్‌యువిసి కృష్ణానాయక్‌, ఏఎస్పీ పద్మాకర్‌రావు, రిజిస్ట్రార్‌ ఎన్‌టికె నాయక్‌, ప్రెస్‌ అకాడమీ పాలక మండలి సభ్యులు కెబిజి తిలక్‌, డిపిఆర్‌ఓ తిమ్మప్ప పాల్గొన్నారు. మొదట జ్యోతిని వెలిగించి ముఖ్యఅతిథులు శిక్షణా తరగతులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రెస్‌ అకాడమీ ఛైర్మెన్‌ సురేందర్‌ మాట్లాడారు. ఇప్పటి వరకూ 15 శిక్షణా శిబిరాలను పూర్తి చేసి 16వది కర్నూలులో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. పత్రికా రంగం వృత్తిలో నైపుణ్య విలువలు పెంపొందిం చేందుకు గ్రామీణ విలేకరులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని సమాజాభివృద్ధికి పాటుపడేవిధంగా వార్తలను సేకరించి ప్రజలకు అందిం చాలని ఆయన కోరారు. కలెక్టర్‌ రాంశంకర్‌నాయక్‌ మాట్లాడుతూ భారతరాజ్యాంగంలో పత్రికా రంగానికి ప్రధాన గుర్తింపు ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పత్రికలు బాధ్యతా యుతంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని కోరారు. సమాజ అభివృద్ధికి పాటుపడే విధంగా విలేకరులు వార్తలు రాయాలని సూచించారు. ఆర్‌యువిసి కృష్ణానాయక్‌ మాట్లాడుతూ పత్రికలు ప్రస్తుతం సమాజ అభివృద్ధికి దోహదపడే విధంగా కృషి చేయాలని కోరారు. పరిశోధనాత్మక వార్తలు, ప్రభుత్వ పథకాలు, మీడియా భాష, తదితర అంశాలపై లెక్చరర్లు విలేకరులకు శిక్షణను అందజేశారు.

2, మార్చి 2012, శుక్రవారం

ప్రజాచైతన్య కరదీపిక పుస్తక సాహిత్యం

ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ పంపాదకులు తెలకపల్లి రవి
          పుస్తకసాహిత్యం ప్రజాచైతన్య కరదీపికలా అసమానతలతో కూడిన వ్యవస్థను ప్రతిఘటించేలా ఉపయోగపడాలని ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ సంపాదకులు తెలకపల్లి రవి అన్నారు.ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కేంద్రం కొత్తబస్టాండు సమీపంలోని సుందరయ్య జంక్షన్‌ మార్కెట్‌ యార్డు మినీకాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ప్రజాశక్తి బుకహేౌస్‌ను శుక్రవారం సిపిఎం సీనియర్‌ నాయకులు టి.నరసింహయ్య ప్రారంభించారు. ప్రజాశక్తి కర్నూలు ఎడిషన్‌ మేనేజర్‌ ఎ.వెంకటేష్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభలో రవి ముఖ్యోపన్యాసం చేశారు. అభ్యుదయ సాహిత్యాన్ని, శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించేలా ప్రజాశక్తి బుకహేౌస్‌ పని చేస్తుందని చెప్పారు. మానవ మస్తిస్కాలకు పదును పెట్టే గ్రంథాలయాలు శిథిలావస్థకు చేరాయన్నారు. గ్రంథాలయాల్లో పని చేసే ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా అందడం లేదన్నారు. అనంతరం సీనియర్‌ నాయకులు నరసింహయ్య మాట్లాడుతూ నవశక్తి, విశాలాంధ్ర, జనశక్తిగా రూపాంతరం చెందుతూ ప్రజాశక్తిగా మారిందన్నారు. ప్రజాశక్తితో తనకు చాలా అనుబంధముందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌ మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే సాహిత్య కేంద్రంగా ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ ఉండాలన్నారు. మార్క్సిస్టు సాహిత్యంతోపాటు సమాజ పరిణామం, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అందించే పుస్తకాలు జిల్లా ప్రజలకు అందించా లని ఆకాంక్షించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎన్‌ లలిత మాట్లాడుతూ ప్రజల అభివృద్ధ్ధికి అనుగుణంగా ఉపయోగపడే అన్ని రకాల పుస్తకాలను ప్రజాశక్తి బుకహేౌస్‌లో ఉంచాలని సూచించారు. అభ్యుదయ సాహిత్యంతో పాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు కావల్సిన పుస్తకాలను కూడా అందుబాటులో ఉంచాలని కోరారు. లలిత కళాసమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, ఉస్మానియా కళా శాల విశ్రాంత అధ్యా పకులు వెంకట్రామిరెడ్డి, ప్రజాశక్తి ఎడిషన్‌ ఇన్‌చార్జి పి చంద్రయ్య, జిల్లా కన్వీనర్‌ ఎం.రాజు పాల్గొన్నారు.

27, ఫిబ్రవరి 2012, సోమవారం

నాలుగు స్థానాల్లో పోటీలో ఉంటాం

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు
               ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగు స్థానాల్లో పోటీలో ఉంటామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. రాష్ట్రంలో ఏడు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయని, అందులో సిపిఎం నాలుగు స్థానాల్లో పోటీ చేస్తోందన్నారు. ఉప ఎన్నికల్లో ప్రజలను ఓటు అడిగే హక్కు సిపిఎంకు మాత్రమే ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి జొన్నలగడ్డ వెంకమరాజు సోమవారం నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమంలో రాఘవులు పాల్గొన్నారు. దీంతో మీడియా వింత ప్రచారం చేస్తోందనీ, టిడిపికి సిపిఎం ఝలక్‌ ఇచ్చిందనీ, 2014 ఎన్నికల్లో కలవరని ప్రచారం చేస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పార్టీ పోటీకి దిగిందని చెప్పారు. మిగతా రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలను విస్మరించాయని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు. పార్టీ నిర్ణయం మేరకు ప్రస్తుతం పోటీచేస్తున్నామన్నారు ప్రకాశ్‌ కరత్‌తో చంద్రబాబు మాట్లాడి పోటీనుండి ఉపసంహరించుకునేలా చేస్తారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ, తమ పార్టీలో నాయకులను మేనేజ్‌ చేసే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగులు, రైతులు, దళితులు అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉంటే చంద్రబాబు తల్లికి రూ.50 లక్షలు ఎలా వచ్చాయనీ, కెసిఆర్‌కు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయనే విషయాల చుట్టే రాజకీయాలను నడుపుతున్నారన్నారు. అధికార పార్టీ నాయకులు మద్యం ముడుపుల కేసుల్లో ఉన్నారని, టిడిపి కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటోందన్నారు. ఏప్రిల్‌ నుండి రాష్ట్రంలో 4900 కోట్ల విద్యుత్‌ ఛార్జీలు, ఇంధన సర్‌ఛార్జీల కింద మరో 10 వేల కోట్ల రూపాయలు భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. మళ్లీ విద్యుత్‌ ఛార్జీలు పెంచితే ఉద్యమం మహోధృతంగా ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వానికి మద్యం ద్వారా 14 వేల కోట్ల రూపాయల పన్నులు వస్తున్నాయని, ప్రజా ప్రతినిధులకు లక్షలాది రూపాయలు మద్యం సిండికేట్ల నుంచి ముడుపులు అందుతున్నాయని అన్నారు. ప్రభుత్వానికి దమ్మూ, ధైర్యం ఉంటే మహిళల ఆమోదం తీసుకుని ఆయా గ్రామాల్లో మద్యం షాపులు పెట్టాలన్నారు. 104, 108 గ్రామ సేవకులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఐకెపి, మధ్యాహ్న భోజన కార్మికులు చేస్తున్న ఆందోళనలకు తమ పార్టీ మద్దతిస్తోందన్నారు. మరే ఇతర రాజకీయ పార్టీ వారికి మద్దతు తెలపలేదని, అలాంటప్పుడు వారికి ఓట్లేందుకు వేయాలని ప్రశ్నించారు. సిపిఎం విజయం సాధిస్తే అన్ని ప్రజా సమస్యలు చర్చకొస్తాయనీ, పరిష్కారానికీ నోచుకుంటాయనీ అన్నారు. సభలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జక్కా వెంకయ్య, జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి.పి.భానురాజు, ఎం.మోహన్‌రావు, పి.శ్రీరాములు, మాదాల వెంకటేశ్వర్లు, పి.చంద్రమౌళి తదితరులున్నారు.
కొల్లాపూర్‌ సిపిఎం అభ్యర్థి ఎండి జబ్బార్‌ నామినేషన్‌
          మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థిగా ఎం డి జబ్బార్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. కొల్లాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఎన్నికల అధికారికి మధ్యాహ్నం నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కొల్లాపూర్‌ పట్టణంలోని పెట్రోలు బంకు నుండి బస్టాండ్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, వై.వెంకటేశ్వర్‌రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జాన్‌వెస్లీ, టి.సాగర్‌, జిల్లా కార్యదర్శి కిల్లె గోపాల్‌, సీనియర్‌ నాయకులు వనగంటి ఈశ్వర్‌ ప్రదర్శన అగ్రభాగాన నడిచారు. డప్పువాయిద్యకారులు, కళానృత్యాలతో కళాకారులు ముందు రాగా కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ మార్చి 18న జరిగే ఉప ఎన్నికల్లో ప్రజల పక్షాన నిలబడి పని చేస్తున్న సిపిఎం అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. పూర్తి స్థాయిలో శాసనసభ సమావేశాలు జరిగితే సభ్యుల అవినీతి చిట్టా బయటపడుతుందని, సమావేశాలు పూర్తికాకుండా అడ్డు తగులుతున్నారని విమర్శించారు. ప్రజాసమస్యలు పట్టించుకోకుండా అవినీతికి పాల్పడుతున్న అభివృద్ధి నిరోధకులను ఓడించాలన్నారు. 30 ఏళ్లుగా ప్రజాతంత్ర ఉద్యమంలో కార్మిక, కర్షక, ఉద్యోగ, విద్యార్థి, యువజన పక్షాన పనిచేస్తున్న ఎం.డి జబ్బార్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కొల్లాపూర్‌లో రెండు పర్యాయాలు మంత్రిగా పని చేసిన జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్‌ ప్రాంత ప్రజలకు రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేకపోయారని విమర్శించారు.
ఆకట్టుకున్న భారీ ర్యాలీ
        జొన్నలగడ్డ వెంకమరాజు నామినేషన్‌ సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరు ఎర్రబారింది. కోవూరు పట్టణంలో అభ్యర్థితో పాటు రాఘవులు, జిల్లా కార్యదర్శి రాజగోపాల్‌ ఎడ్లబండిపై ప్రదర్శనగా వచ్చారు. సిపిఎం అభ్యర్థి జొన్నలగడ్డ వెంకమరాజు సోమవారం కోవూరు తహశీల్దారు కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు అందజేశారు.

11, జనవరి 2012, బుధవారం

పిల్లలకే కాదు పెద్దలకు కూడా ........

            పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఆహారం అందించే స్థోమత మన పాలకులకు లేదు. పరిపాలనా వ్యవహారాల పట్ల చిత్తశుద్ధి లేదు. మనదేశంలో ప్రజాస్వామ్యాన్ని అడ్డుపెట్టుకుని ఈ దేశంలోని కోటేశ్వరులు, దోపిడీ దారులు అత్యధిక ప్రజల శ్రమను దోచుకుంటున్నారు. సంపద కొందరితో పోగయ్యాక అందరికీ కూడు, గూడు, గుడ్డ దొరకడం కష్టంగా మారే పరిస్థితి దాపురించింది. దీనికి తోడు పరిపాలనా వ్యవహారాల్లోని అమాత్యులు, ఉన్నతాధిóకారులు అవినీతికి పాల్పడుతున్నారు. దీంతో ప్రజలకు అందాల్సిన పథకాలేవీ సక్రమంగా అందడం లేదు. మరి పోషకాహారం ఎలా అందుతుంది. ఇప్పటికీ రక్తహీనతతో బాధపడుతున్న మహిళ అత్యధికంగానే ఉన్నారు. పిల్లలకు పోషకాహారం కూడా అందించలేని ప్రభుత్వం దేశ ప్రజల కోసం చేస్తున్నదేమిటి. పోషకాహార లోపం దేశానికే సిగ్గుచేటని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలు మన పాలకుల పరిపాలనా తీరును ప్రశ్నిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 42 శాతం మంది చిన్నారులు బరువు తక్కువగా ఉన్నారని, 59 శాతం మంది వయస్సుకు తగ్గట్టుగా ఎదగలేదని ప్రధాని చెప్పిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆహార భద్రత బిల్లు ఈ సమస్యకు ఎటువంటి పరిష్కారం చూపలేదు. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఒక్క రూపాయి, రెండు రూపాయలకే కిలో బియ్యం సరఫరా చేస్తుంది. బియ్యం, గోధుమల వంటి ఆహారధాన్యాలను తక్కువ ధరలకు ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. దేశవ్యాప్తంగా కిలో రెండు రూపాయలకే ఆహార ధాన్యాలను సరఫరా చేయాలి. కుటుంబానికి నెలకు 35 కిలోలు ఇవ్వాలి.ఆహార భద్రత బిల్లుకు సవరణలు ప్రతిపాదించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆహార భద్రత బిల్లు వాస్తవానికి ఇప్పటికే ఉన్న భద్రతను కూడా దూరం చేస్తుంది. పలు రాష్ట్రాలు ఒక్క రూపాయికి, రెండు రూపాయలకు కిలో ఆహారధాన్యాలను అందిస్తుండగా, కేంద్రం మూడు రూపాయలకు కిలో ఇవ్వాలని ప్రతిపాదించింది. బిపిఎల్‌ కుటుంబాలకే దీన్ని పరిమితం చేయడంతో పాటు రేషన్‌ను పరిమితం చేయించింది. బిపిఎల్‌ కుటుంబాలను ప్రాధాన్యత వర్గంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం ఎపిఎల్‌ కుటుంబాల్లోని దిగువ తరగతి ప్రజలను పూర్తిగా విస్మరించింది. బిపిఎల్‌ కుటుంబాలకిచ్చే సబ్సిడీని సైతం నేరుగా ఇవ్వకుండా కొన్ని షరతులతో నగదు బదిలీ రూపంలో ఇవ్వాలని ప్రతిపాదించారు. దీని వల్ల బిపిఎల్‌ కుటుంబాలు సైతం నష్టపోయే పరిస్థితి వస్తుంది. దీనికి భిన్నంగా ప్రజలందరికీ అవసరమైన మేరకు తక్కువ ధరకు ఆహారధాన్యాలు అందుబాటులో ఉంచాలి.

4, డిసెంబర్ 2011, ఆదివారం

అవిశ్వాసం అధికార కాంగ్రెస్‌కే అనుకూలం?!

             ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సమస్యలను పక్కనపెట్టి బలనిరూపణకు సిద్ధమయ్యారు. చంద్రబాబు రైతు పోరుబాట పేరుతో పాదయాత్రలు చేశారు. రైతుల కోసం అవసరమైతే అవిశ్వాస తీర్మానం పెడతామని అన్నారు. దాని ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టారు. నెగ్గాలంటే 294 శాసన సభ్యులలో 147 మ్యాజిక్‌ సంఖ్య అవసరం. ఈమ్యాజిక్‌ సంఖ్యలో కూడా ఒకరు చనిపోవడం కొందరు రాజీనామా కారణంగా మారనుంది. టిడిపికి 90 మంది సభ్యులు ఉండేవారు. ఇటీవల ముగ్గురు దూరమయ్యారు. టిఆర్‌ఎస్‌, బిజెపి, ఎంఐఎం తదితరులను కలిపి 21, కాంగ్రెస్‌, ప్రజారాజ్యం పార్టీల నుంచి 27 మంది జగన్‌కు జై కొట్టారు. ఈ మధ్య ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌ వైపు వెళ్లారు. ఇవన్నీ కలిపినా 141 మంది సభ్యులు మాత్రమే అవుతున్నారు. మరో ఆరుగురు సభ్యులను కూడగడితే కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉండేది. కానీ ఇంతలోనే సీను రివర్స్‌ అయ్యింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత జగన్‌ సిబిఐ కేసులో ఇరుక్కుని పీకల్లోతు కష్టాల్లో పడటంతో ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలకు జ్ఞానోదయమయినట్లుంది. వారు తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నారు. కారణాలడిగితే 'యువకిరణాలు' తదితరాల పేర్లు చెబుతున్నారు. కాబట్టి ఆవిశ్వాసానికి కావల్సిన మ్యాజిక్‌ సంఖ్యను కూడగట్టం కష్టమే అనిపిస్తోంది. అయితే రాష్ట్రంలో కరువు, అధిక ధరలు, ప్రత్యేక తెలంగాణా , పెండింగు ప్రాజెక్టులు, రైతుల సమస్యలు ప్రస్తావించడానికి అస్త్రాలు సిద్దం చేసుకున్నాయి ప్రతిపక్షాలు. కాని అధికార పక్షం చాకచక్యంగా వ్యవహరించి సభా సమయాన్ని ఐదు రోజులకే కుదించారు. ఇందులో కూడా అనవసర విషయాలతో కాలయాపన చేయడం ఎపి శాసన సభ్యులకు కొత్తేమి కాదు. యువకిరణాల పేరుతో ఉద్యోగాలిస్తామని, సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని కిరణ్‌కుమార్‌ ప్రభుత్వం హామీల వర్షం కురిపించడానికి ప్రయత్నిస్తోంది. ఈనేపథ్యంలో ఎమ్మెల్యేల నెంబర్‌ గేమ్‌ మొదలైంది. అవిశ్వాస తీర్మానంపై సోమవారం (2011 డిసెంబర్‌ 5న) చర్చ జరగనున్న నేపథ్యంలో తమ వారెవరు, పరాయి వారెవరు అన్న లెక్కల్లో అధికార, ప్రధాన ప్రతిప్రక్షాలు బిజీగా ఉన్నాయి. ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు, మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్‌, టిడిపి, జగన్‌ గ్రూపు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీలు తమ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేశాయి. జగన్‌ గ్రూపు ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు కాంగ్రెస్‌ తాయిలాలను ఎర వేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. జగన్‌ సైతం తన వెంట ఉన్నవారికి పలు 'హామీలు' ఇచ్చినట్లు చెబుతున్నారు. తమకు గుర్తింపు ఇవ్వట్లేదని అసంతృప్తిగా ఉన్న పిఆర్‌పి ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పలు 'వాగ్దానాల'తో బుజ్జగించింది. ఆదివారం(డిసెంబర్‌ 4న) కరువుపై చర్చ తర్వాత అవిశ్వాసంపై చర్చను లాంఛనంగా ప్రారంభించాలని బిఎసి సమావేశంలో నిర్ణయించారు. కరువుపై సాయంత్రం ఆరున్నర వరకు సుదీర్ఘంగా చర్చ జరగడంతో అవిశ్వాసంపై చర్చను చేపట్టలేదు. దీంతో సోమవారమే చర్చ, ఓటింగ్‌ జరగనుంది. ఉదయం తొమ్మిది గంటలకు అవిశ్వాసంపై చర్చను ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రారంభించనున్నారు. బొత్స, ఢిల్లీ నుండి గులాంనబీ ఆజాద్‌, అహ్మద్‌ పటేల్‌ రంగంలోకి దిగి పిఆర్‌పిని బుజ్జగించి తమ వైపు ఉండేలా చర్యలు తీసుకున్నారు. జగన్‌ తమ గ్రూపు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేయాలని నిర్ణయించారు. జగన్‌ నిర్వహించిన సమావేశంలో 19 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఓటింగ్‌ దగ్గరకొచ్చే సరికి ఆ సంఖ్య తగ్గుతుందని, కనీసం 15 మంది అవిశ్వాసాన్ని బలపరుస్తారని తెలుస్తోంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే విజయమ్మ సోమవారం అసెంబ్లీకి వస్తారని ఆ పార్టీ నేతలు తెలిపారు. టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేస్తామన్నారు. ఈ మేరకు ఆ పార్టీ తమ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసింది. వామపక్షాలు అవిశ్వాసానికి మద్దతివ్వాలని నిర్ణయించాయి. మరో పక్క తెలంగాణా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని టిఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది. ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు టిడిపి ప్రయత్నిస్తోంది. పిఆర్‌పి కాంగ్రెస్‌లో విలీనమయింది. కాబట్టి చిరంజీవి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని కోరుతున్నారు. ఏదేమైనా ఈ పరిణామాలు అధికార కాంగ్రెస్‌కు అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ప్రహసనం తప్ప ప్రజలకు మేలు చేసేది మాత్రం కాదు. సభ్యులంతా చిత్తశుద్ధితో వ్యవహరించి ప్రజల సంక్షేమానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

1, డిసెంబర్ 2011, గురువారం

ఎఫ్‌డిఐని వ్యతిరేకిద్దాం

             రిటైల్‌ రంగంలో ఎఫ్‌డిఐని వ్యతిరే కించి, చిల్లర వర్తకులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్‌ అన్నారు. బుధవారం కర్నూలు స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో ప్రజాశక్తి ఆధ్వర్యంలో చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకి స్తూ రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రజాశక్తి ఎడిషన్‌ ఇన్‌ఛార్జి పానుగంటి చంద్రయ్య అధ్యక్షత వహించారు. ఎంఏ గఫూర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నిరుద్యోగులకు కోట్ల ఉద్యోగాలు విదేశీ పెట్టుబడుల వల్ల లభిస్తాయని మోసపూరిత ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రిటైల్‌ రంగంలో చిల్లర దుకాణాలు పెట్టుకుని కోట్లాది మంది జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఎఫ్‌డిఐ దేశంలో ప్రవేశిస్తే వీదేశాలు పెట్టుబడులు పెట్టడం వల్ల వారి పెత్తనంతో పాటు ఆదాయాలు కూడా వారికే పోతాయన్నారు. ప్రధాని వీటి ద్వారా ఉపాధి కలుగుతుందని చెప్పడం బూటకమన్నారు. ఎఫ్‌డిఐ ప్రవేశం వల్ల భారతదేశ వస్తు ఉత్పత్తి పరిశ్రమలు దెబ్బతింటాయన్నారు. వీటితో పాటు వ్యవసాయరంగం కూడా వారి ఆధీనంలోకి వెళ్తుందని తెలిపారు. దేశ నవనాడులన్నీ విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లోకి పోతున్నాయని చెప్పారు. ఇలా ఒక్కో రంగంలో ప్రవేశిస్తూ పత్రికా రంగంలో ప్రవేశించనుందన్నారు. పాలకులు ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారని తెలిపారు. రిటైల్‌ రంగాన్ని కాపాడుకునేందుకు గురువారం చేపట్టే బంద్‌కు అందరూ సంఘీభావం తెలపాలని రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానించింది. ఈసమావేశంలో టిడిపి జిల్లా నాయకులు ఆకెపోగు ప్రభాకర్‌,సిపిఎం నగర కార్యదర్శి గౌస్‌దేశాయి, బిజెపి నాయకులు దామోదర్‌రెడ్డి, సమాజ్‌వాది పార్టీ నాయకులు శేషుఫణి, మెడికల్‌ రెప్స్‌ యూనియన్‌ నాయకులు ప్రసాద్‌శర్మ, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఎండి ఆనంద్‌బాబు, డివైఎఫ్‌ఐ నగర అధ్యక్షులు లక్ష్మణ్‌, చిన్న వ్యాపారుల సంఘం నాయకులు షరీఫ్‌, వ్యాపారులు సుధాకర్‌, ప్రకాష్‌, ప్రజాశక్తి జిల్లా కన్వీనర్‌ ఎం.రాజు, ప్రతినిధి బి.గోరంట్లప్ప, సిబ్బంది సుజాత, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.