18, అక్టోబర్ 2010, సోమవారం

తొండ ముదిరి ఊసరవెళ్లి అయినట్లు

ఆర్డ్‌ నెన్స్‌పై కోర్టుకు
మైక్రో సంస్థల స్టే పిటిషన్‌కు సిద్ధం
మైక్రో రుణసంస్థలను నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ మైక్రో సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నాయి. దీని ప్రమాదాన్ని గుర్తించక పోవడం ప్రభుత్వం పొరపాటు చేసింది. దీంతో తొండముదిరి ఊసరవెళ్లి అయిన చందంగా మైక్రో సంస్థల నిర్వాహకులు బాగా సంపాదనకు అలవాటు పడ్డారు. ఆ దోపిడినీటి అరికట్టాలనుకున్న వారిపై ఎలాంటి చర్యలకైనా ముందుకు వెళ్తుంది. లాభాలొస్తాయనుకుంటే పెట్టుబడి దారుడు దేనికీ వెనుకాడడని కారల్‌ మార్క్స్‌ చెప్పాడు. అధికంగా లాభాలొస్తాయంటే ప్రాణాలనైనా ఫణంగా పెడుతారు. కాబట్టి పెట్టుబడి దారుడు దేనికైనా సిద్ధమే. ప్రభుత్వం చిత్తశుద్ధితో లేకుంటే ఏదయినా సాధ్యపడవచ్చు. ఎస్‌కెఎస్‌ మైక్రో ఫైనాన్స్‌ సంస్థ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయం తెలియచేసింది. ఆర్డినెన్స్‌ అమలు కాకుండా నిరోధించేందుకు కోర్టులో స్టే పిటిషన్‌ దాఖలు చేయాలని మైక్రోఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ నెట్‌వర్క్‌ (ఎంఎఫ్‌ఐఎన్‌) యోచిస్తున్నట్లు ఎస్‌కెఎస్‌ మైక్రో ఫైనాన్స్‌ తెలిపింది. ఈ ఆర్డినెన్స్‌ తమ సంస్థకు వర్తిస్తుందా లేదా అనే విషయమై న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటామని ఎస్‌కెఎస్‌ చెప్పింది. తమది నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ కాదని ఆ ప్రకటనలో పేర్కొంది.

16, అక్టోబర్ 2010, శనివారం

విజయదశిమి శుభాకాంక్షలు

దసరా ఒక హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు పదో రోజు విజయదశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తరువాతి మూడు రోజులు లక్ష్మీ దేవికి తరువాతి మూడు రోజులు సరస్వతీ దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభాస్యంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితి. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదోరోజు పార్వేట ఉంటుంది. ఈ రోజు ప్రజలు ఒక ప్రదేశంలో కూడి వేడుక జరుపుకుంటారు. జమ్మిచెట్టు ఉన్న ప్రదేశంలో పార్వేట చేయడం ఆనవాయితీ.
దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకుంటారు. తెలుగువారు దసరాని పదిరోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రుల్లో దుర్గా పూజ ఉంటుంది. తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమవాస్యకి స్త్రీలు పట్టు వస్త్రాలు ధరించటం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మిచెట్టు పై తమ ఆయుధాలను తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భంగా పదో రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకున్నారు. అదే విజయదశమి. దేవి పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది. దసరా ఉత్సవాలను దేశమంతటా వివిధ రూపాల్లో జరుపుకుంటారు. మైసూరు, కోల్‌కతా, ఒరిస్సా, తెలంగాణా, విజయవాడలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఒంగోలులో కళాకారుల రూపంలో అమ్మవారిని ఆదాదిస్తారు. విజయవాడలో బేతాళ నృత్యం, విజయనగరం సిరిమాను. వీపనగండ్లలో రాళ్ల యుద్ధం, బందర్‌లో శక్తి పటాలు, వీరవాసనంలో ఏనుగు సమరంభం తదితర రూపాల్లో ఈ పండుగను జరుపుకుంటారు.
కోల్‌కతాలో దసరాను దుర్గా పూజ పర్వంగా బెంగాళీలు జరుపుకుంటారు. సప్తమి, అస్టమి, నవమి తిథులలో దుర్గా మాతకు పూజ చేసి తొమ్మిదో రోజున పూజిస్తారు. ఆ రోజు కాళీమాతను లక్షలాది మంది దర్శించడం విశేషం. తొమ్మిది రోజులు రాష్ట్ర మంతా హరి కథలు, పూరాన స్రవనం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజు దుర్గా మాతను హుగ్లీ నదిలో నిమజ్ఞనం చేస్తారు. నదీ తీరంలో కూమారీ పూజలు చేయడం బెంగాళీల ప్రత్యేకత. ఒరిస్సాలో కటక్‌ కళాకారులు రూపొందిచిన దుర్గా మాత రూపాలను వీధి వీధిల్లో ప్రతిష్టిస్తారు. మహిళలు మాణికలో వడ్లు నింపి లకిëదేవిగా భావించి పూజలు చేస్తారు. దీనిని వారు మాన బాన అంటారు. ఒరిస్సా ప్రజలు విజయ దశమినాడు విజయ దుర్గాను ఆరాదిస్తే అన్నింటా విజయం సిద్ధిస్తుందని అక్కడి ప్రజలు విశ్వాసం. చివరి రోజున పదిహేను అడుగుల రావణ విగ్రహాన్ని బాణ సంచాతో తచారు చేసి మైదానంలో కాల్చుతారు. ఈ రావణ కాష్టం చూడటాడనికి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తారు. మైసూరు మహారాజు పాలన కాలం నుంచి వైభవంగా దసరా ఉత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీ.

14, అక్టోబర్ 2010, గురువారం

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు

మైక్రో ఫైనాన్స్‌ సంస్థల ఆగడాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన అక్టోబర్‌ 14న భేటి అయిన రాష్ట్ర మంత్రిమండలి చర్యలు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది. ఈ పరిస్థితి రాకముందే తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇంతమంది చచ్చే వారు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగడాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సంస్థలను నియంత్రించేందుకు 'మైక్రో ఫైనాన్స్‌ సంస్థల నియంత్రణ ఆర్డినెన్స్‌'ను మంత్రి మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. దీన్ని ప్రభుత్వం గవర్నర్‌కు పంపించింది. మరో రెండ్రోజుల్లో రాష్ట్రంలో ఆర్డినెన్స్‌ అమల్లోకి రానుంది. మైక్రో సంస్థలు రుణం తీసుకున్న సభ్యులను వేధింపులకు గురిచేస్తే మూడేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానాను విధించే అవకాశముంది. మైక్రో వేధింపుల కేసుల విచారణ నిమిత్తం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేస్తారు. వేధింపుల నివారణ చట్టాన్ని పటిష్టపర్చేందుకు చర్యలు చేపడుతారు. వడ్డీ గురించి చివరి నిమిషంలో ఆర్డినెన్స్‌ నుంచి తొలగించినట్లు తెలిసింది. దీనిపై కొంతమంది మంత్రులు సూచించినా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో తీసుకునే నిర్ణయం కానందున తొలగించింది. మైక్రో సంస్థలు ఎంత వడ్డీ వసూలు చేసినా ఆర్డినెన్స్‌ పట్టించుకోదు. వడ్డీల నియంత్రణపై ఆర్డినెన్స్‌కు అధికారం లేదంటున్నారు. వసూళ్ల సమయంలో సంస్థలు పెట్టే ఇబ్బందులపై బాధితులు ఫిర్యాదు చేసిన పక్షంలో అధికారులు చర్యలు తీసుకోవడానికి ఈ ఆర్డినెన్స్‌ ఉపయోగపడుతుంది. మైక్రోఫైనాన్స్‌ సంస్థలు జిల్లా స్థాయిలో డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరక్టర్‌ దగ్గర రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని నిబంధన విధించారు. అంతేకాకుండా అయా సంస్థలు రిజిస్ట్రేషన్‌ పొందాయా లేదా అనే అంశాన్ని డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరక్టర్లు పరిశీలించాలని సూచించింది. సంఘాలకు రుణాలు ఇచ్చేముందు ఎంత వడ్డీని నిర్ణయిస్తారో సభ్యులకు సమాచారమివ్వాలని నిర్ణయించింది. అధిక వడ్డీని నియంత్రించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరంగా పర్యవేక్షించాలని ఆదేశాలు జారీచేయాల్సిన అవసరం ఉంది. మంత్రి మండలిలో చర్చించిన అంశాలను గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి వట్టి వసంతకుమార్‌ విలేకరులకు వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మైక్రోసంస్థల ఆగడాల గురించి గత కొంత కాలంగా పత్రికల్లో ప్రముఖంగా కథనాలు వస్తోన్నాయని చెప్పారు. ఈఅంశంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, మహిళాసంఘాలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించామని చెప్పారు. రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా పరిధిలోనే సంస్థలు వడ్డీ వ్యాపారం చేస్తోన్నాయి, కానీ అధిక వడ్డీతో
మహిళాసంఘాలను ఇబ్బంది పెడుతున్నాయని చెప్పారు. అప్పుల నియంత్రణ చట్టం సత్వరం అమలు చేయాలని రాష్ట్రపతిని కోరనున్నట్లు తెలిపారు. రెవెన్యూ డివిజన్‌ పరిధిలో మైక్రోఫైనాన్స్‌ సంస్థల నుంచి అధిక వడ్డీతో రుణాలు తీసుకున్న సభ్యుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించనున్నట్లు చెప్పారు. అధిక వడ్డీని సబ్సిడి పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అధిక వడ్డీ బాధల నుంచి బాధితులను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. కాని ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల అమలు తీరును చూస్తే ప్రభుత్వం పూర్తిస్థాయిలో అరికట్టే అవకాశం తక్కువగానే ఉంది. అయినా చూద్దాం తొందరెందుకు.

13, అక్టోబర్ 2010, బుధవారం

ఫలిస్తున్న ప్రజాసంఘాల పోరాటాలు

స్థానిక సమస్యలపై ప్రజాసంఘాలు నిర్వహిస్తున్న నిరవధిక, రిలే దీక్షలకు మద్దతుగా ప్రజల నుంచి సంఘీభావం వ్యక్తమవుతోంది. దీక్షలకు సంఘీభావంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అదే తరుణంలో ప్రభుత్వం నుంచి కూడా ఆలస్యంగా నైనా మంచి ఫలితాలే వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో అధికారులు దిగిరాక తప్పడం లేదు. ఇళ్లస్థలాల సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లుల సమస్యలు పరిష్కారమవుతున్నాయి. స్థలాలు ఇచ్చిన చోట పట్టాలు ఇవ్వక పోవడం, పట్టాలు ఇచ్చిన చోట స్థలాలు చూపక పోవడం వంటివి రాష్ట్రంలో పలు చోట్ల బయట పడుతున్నాయి. పెండింగు పడిన ఇందిరమ్మ బిల్లులు ఇవ్వడానికి అధికారులు ముందుకు వస్తున్నారు. అదే విధంగా ఇళ్లస్థలాలు చూపుతున్నారు. పించన్లు, రేషన్‌కార్డుల సమస్యలు పరిష్కారమవుతున్నాయి. రోడ్లు, డ్రయినేజీ సమస్యల పరిష్కారానికి కూడా అధికారులు హామీ ఇస్తున్నారు. సిపిఎం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షల మాదిరిగానే ఇతర పార్టీలు, వాటి ప్రజాసంఘాలు కలిసొస్తే పేదల సమస్యలు ఎక్కువగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం సిపిఎం దాని అనుబంధ సంఘాలు మాత్రమే ఆందోళన చేస్తున్నాయి. కాంగ్రెస్‌ ఎట్లాగు అధికార పార్టీ కాబట్టి ప్రజల తరుపున పోరాటాలు చేయడానికి ముందుకు రాలేదంటే అర్థం ఉంది. కాని ప్రధాన ప్రతిపక్షం టిడిపి , బిజెపి , ప్రజారాజ్యం, టిఆర్‌ఎస్‌, ఇతర రాజకీయ పార్టీలన్నీ ముందుకు వచ్చి ప్రజల సమస్యల పట్ల పోరాటాలు చేస్తే ఎక్కువ సమస్యలు పరిష్కార మయ్యే అవకాశం ఉంది. కాని వాటికి చిత్తశుద్ధి లేదనిపిస్తోంది. రాజకీయ పార్టీలు ప్రజలకు సేవ చేస్తామని ముందుకొస్తాయి. కాని నిజాయితీగా ప్రజల తరుపున పని చేయడానికి వెనుకాడుతున్నాయి. రాజకీయ ప్రజయోజనం ఉందనుకున్నచోట మాత్రమే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ధోరణి నుంచి బయట పడాలి.

12, అక్టోబర్ 2010, మంగళవారం

అపరమేథావి గ్రామం అథోగతి



మాడ్గుల పంచాయతీలో ఎక్కడి సమస్యలక్కడే
30 ఏళ్లుగా జైపాల్‌రెడ్డి కుటుంబీకులదే పాలన
''ఆయన అపరమేథావి... ఆయన పార్లమెంటులో ఆంగ్లంలో ప్రశ్నలడిగితే సభ్యులు నిఘంటువులు వెతకాలి. సమస్యలను, సవాళ్లను చాకచక్యంగా చర్చించగల సమర్థునిగా గుర్తింపు పొందారు. ఏపార్టీ అధికారంలో ఉన్నా ఆయనకు కీలకమైన పదవులే లభించాయి. ఆయన స్వగ్రామం మాత్రం సమ్యలకు నిలయమైంది. పరిష్కారానికి నోచుకోలేదు. అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని అన్నచందంగా ఉంది. స్వగ్రామంపై ప్రేమలేకనా?.... నిధులు లేకనా? ఆసమస్యలను పరిష్కరించేందుకు సాధ్యంకాకనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయనెవరోకాదు.... కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి. ఆయన సొంత గ్రామం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మహబూబ్‌నగర్‌ జిల్లా మాడ్గుల. ఆ గ్రామాన్ని 30 ఏళ్ల పాటు ఆయన కుటుంబీకులే పాలించారు. ఇప్పటికీ గ్రామంలో అనేక సమస్యలు తిష్టవేశాయి''.
ప్రధానంగా గ్రామంలో ఫ్లోరైడ్‌ సమస్య తీవ్రంగా ఉంది. గ్రామస్తులు అనేక రోగాల బారిన పడ్తున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా పాడుబడిన ఇండ్లు, గుంతలమయమైన రోడ్లే కనిపిస్తాయి. గ్రామపంచాయతీలు ఏర్పడిన నాటి నుండి నేటి వరకు దాదాపు 30ఏళ్ల పాటు జైపాల్‌రెడ్డి కుటుంబం పాలించినప్పటికీ గ్రామం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. తమ గ్రామం నుండి కేంద్ర స్థాయిలో పలుకుబడి ఉన్న వ్యక్తి తమ గ్రామస్తుడైనా తమకెలాంటి ప్రయోజనం లేదని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికీ తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నామని పేర్కొన్నారు. గ్రామపంచాయతీలు ఏర్పడినప్పుడు తొలి సర్పంచిగా సూదిని రామలింగారెడ్డి ఎన్నికయ్యారు. 1967వరకు ఆయన కొనసాగారు. ఆ తర్వాత సంవత్సరంపాటు వెంకటయ్య, మరోసంవత్సరం పాటు సూదిని నర్సింహారెడ్డి, మరో సంవత్సరం పాటు రసూలు, సూదిని క్రిష్ణారెడ్డి 11సంవత్సరాల పాటు గ్రామ సర్పంచిగా కొనసాగారు. అనంతరం 1981నుండి 94వరకు జైపాల్‌రెడ్డి సోదరుడు సూదిని రామిరెడ్డి కొనసాగారు. 1994 తర్వాత గ్రామ సర్పంచి స్థానం బిసిలకురిజర్వు కావడంతో అప్పటి నుండి 2001వరకు గౌని రాములు కొనసాగారు. 2001నుండి కంబాలపల్లి లక్ష్మమ్మ కొనసాగుతున్నారు. గ్రామపంచాయతీ మొదటి సారి ఏర్పడినప్పుడు మొత్తం జనాభా రెండువేలు ఉండేది. గ్రామంలో వార్డు సభ్యుల సంఖ్య ఆరు ఉండగా ప్రస్తుతం 14కు చేరింది. మొత్తం ఓటర్ల సంఖ్య 4,700కు చేరింది. ఒక్కో వార్డులో 333ఓట్లుగా నిర్ణయించారు. మాడ్గుల గ్రామపంచాయతీ పరిధిలో పెద్దమాడ్గుల, మాడ్గుల తండా, నర్సాయపల్లి, ఖమ్మవారిపాలెం అంబ్లెట్‌ గ్రామాలుగా కొనసాగుతున్నాయి. మాడ్గుల మండల కేంద్రమైనప్పటికీ ఆ రూపు రేఖలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం సర్పంచి లక్ష్మమ్మ హయాంలో గ్రామంలో అక్కడక్కడ సిసి రోడ్లు ఏర్పాటు చేసినప్పటికీ దళితవాడ, హామ్లెట్‌ గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టలేదు. గ్రామానికి నేటికీ సరైన రవాణా సౌకర్యం లేదు. రోడ్లు పూర్తిగా గుంతల మయం కావడంతో ప్రయివేటు వాహనాలు వచ్చేందుకు భయపడుతున్నాయి.
ప్రస్తుత సర్పంచి కూడా జైపాల్‌రెడ్డి అనుచరుడే
ప్రస్తుత సర్పంచి కూడా జైపాల్‌రెడ్డి అనుచరుడే. ఈ సారి గ్రామాన్ని బిసిలకు రిజర్వు చేశారు. కాంగ్రెస్‌ నుండి కాట్లయాదయ్య పోటీ చేసి గెలుపొందాడు. ఎవరున్నా గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో జైపాల్‌రెడ్డి చేసింది మాత్రం నామమాత్రమే.
తాగునీటికోసం తంటాలెన్నో ....
తాగునీటికోసం మాడ్గులతో ప్రజలు తంటాలు పడుతుంటారు. 300-350 అడుగుల లోతుకు తవ్వినా మంచినీళ్ళ దొరకవు. ఒకవేళ దొరికినా ఉప్పునీరే! తాగడానికి పనికిరావు. ప్లోరైడ్‌ గాఢత ఎక్కువగా ఉంటుంది. ఈనీటిని తాగిన వారికి కాళ్లనొప్పులు, కీళ్లనొప్పులు, అరికాళ్లనొప్పులు, మోకాళ్లనొప్పులు, నడుంనొప్పులు, పళ్లగారపట్టడం, ఒంటినొప్పులు, కాళ్లు వంకరపోవడం తప్పవు. ఫ్లోరోసీస్‌నుండి తమను తాము రక్షించుకునెందుకు తాటి కల్లును తాగాల్సివస్తుందని మండల ప్రజలు చెప్తున్నారు. ఇటీవల ఈ సమస్య పరిష్కారమైంది.
తాగునీటి హామీ నెరవేరింది
మాడ్గుల మండలంలోని ప్లోరైడ్‌ పీడిత గ్రామాలన్నీటికి కృష్ణాజలాలు అందిస్తామని జైపాల్‌రెడ్డి గతంలో హామీ ఇచ్చారు. ఆహామీ ఇటీవల నెరవేరింది. 11కోట్ల 25లక్షల రూపాయలతో ఒక పథకానికి రూపకల్పన చేయించారు. నాగార్జునసాగర్‌ ద్వారా కృష్ణాజలాలను ఈ పథకం ద్వారా మాడ్గులకు అందిస్తున్నారు. మాడ్గుల మండలానికి జైపాల్‌రెడ్డి జీవితంలో నెరవేరిన పెద్ద హామీ ఇదొక్కటే. తమ జిల్లాలోని వందలాది ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాలకు తాగునీరు ఇవ్వకుండా మాడ్గులకు ఇవ్వడం సరికాదని నల్గొండ జిల్లా వాసులు అప్పట్లో అభ్యంతరం వ్యక్తమైంది.
జైపాల్‌రెడ్డి స్వగ్రమానికి చేసింది శూన్యం
కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి తన స్వంత గ్రామమైన మాడ్గులకు, ఆమండలానికి చేసిందేమి లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. 1970వ దశకంలో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. కల్వకుర్తి నియోజకవర్గానికి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మహబూబ్‌నగర్‌ ఎంపీగా పని చేశారు. కేంద్రంలో వివిధ మంత్రి పదవులు నిర్వహించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎంపీగాను, గత ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఎపిగా ఎన్నికయ్యారు. అంతకు ముందు రాజ్యసభ సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు. సుదీర్ఘమైన తన రాజకీయ జీవితంలో మంత్రి జైపాల్‌రెడ్డి ఆయన స్వగ్రామం సమస్యలను సైతం పరిష్కరించలేక పోతున్నారనే విమర్శలున్నాయి.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పేరుకే పరిమితం
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పేరుకే పరిమితమైంది. కల్వకుర్తికి చుక్కనీరు వచ్చే అవకాశం లేకుండా పోయింది. రాజకీయ పలుగుపడిని ఉపయోగించి ఎత్తిపోతల పథకం డిజైన్‌ మార్చేశారు. దీంతో కల్వకుర్తి నియోజకవర్గానికి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. కరువు , వలసల జిల్లాగా పేరున్న మహబూబ్‌నగర్‌ జిల్లాకు జైపాల్‌రెడ్డి చేసిందేమి లేదు.

11, అక్టోబర్ 2010, సోమవారం

కర్ణాటక రాష్ట్ర పతి పాలనకు గవర్నర్‌ సిపార్సు


ఇప్పటికైనా లౌకిక వాదులు మేల్కొనాలి
దక్షణాదిలో బిజెపికి తగిన శాస్తి జరగాలి
కర్ణాటక అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్ష ఓ 'ఫార్సు' అని తేల్చిన గవర్నర్‌ రాష్ట్రపతి పాలన కోసం కేంద్రానికి సిఫార్సు పంపినట్లు సమాచారం. అయితే ఇప్పటికైనా లౌకిక వాదులు మేల్కొని మేల్కొని బిజెపికి ముకుదాడు వేయాల్సిన అవసరం ఎంతయినా ఉంది. మతోన్మాదంతో పాటు బడా వ్యాపారుల చేతిలోకి వెళ్లిన పాలనపై ప్రక్షాలన జరగాల్సిఉంది. రాష్ట్ర పాలనపై కేంద్రం ఏ క్షణాన్నైనా నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. రాష్ట్రపతి పాలన విధించటం జరిగితే మూడేళ్ల వ్యవధిలో ఇది రెండోసారి అవుతుంది. శాసనసభలో జరిగిన పరిణామాలన్నీ రాజ్యాంగ విరుద్ధమైనవని గవర్నర్‌ తన లేఖలో పేర్కొన్నట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. సోమవారంనాటి బలపరీక్షకు ముందే స్పీకర్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసారు. ఎడ్యూరప్ప సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌, జెడి(ఎస్‌) సభ్యులు నినాదాలు చేస్తూ స్పీకర్‌ ముందున్న వెల్‌లో గుమిగూడిన సమయంలోనే ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప ఏకవాక్య విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తన ముందు గుమిగూడి నినాదాలు చేస్తున్న ప్రతిపక్ష సభ్యులను పట్టించుకోకుండానే స్పీకర్‌ 106 మంది బిజెపి సభ్యులతో విశ్వాస తీర్మానం నెగ్గినట్లు ప్రకటిస్తూ సభను నిరవధికంగా వాయిదా వేశారు. కేవలం 15 నిముషాల్లోనే బలపరీక్షను పూర్తి చేసిన స్పీకర్‌, ఎడ్యూరప్ప సర్కారు నెగ్గినట్లు ప్రకటించారు.
వందలాది పోలీసుల మోహరింపు
ఇదిలా ఉండగా శాసన మండలికి చెందిన ముగ్గురు సభ్యులు బలపరీక్ష సమయంలో సభలో ప్రత్యక్షమయ్యారు. అనర్హులుగా ప్రకటించిన శాసన సభ్యులను సభలోకి రానివ్వకుండా తలుపులు మూసివేసిన ఘటన కర్నాటక అసెంబ్లీ చరిత్రలో సోమవారం తొలిసారిగా జరిగింది. అసెంబ్లీ మార్షల్స్‌, వందలాదిమంది పోలీసులు అసెంబ్లీ చుట్టుపక్కల మోహరించారు. అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఎడ్యూరప్ప సర్కారును గెలిపించిన స్పీకర్‌ను 'బిజెపి ఏజెంట్‌' అంటూ ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. స్పీకర్‌ ప్రకటనపై ఆగ్రహించిన ప్రతిపక్షాలు గవర్నర్‌ను ఆశ్రయించి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశాయి. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని బిజెపి సర్కారు దుర్వినియోగం చేయటంపై కేంద్ర హోం శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
ఆస్పత్రిలో ఉన్న ఎమ్మెల్యేనూ వదల్లేదు
సర్కారు తన అధికారాన్ని కాపాడుకునే క్రమంలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యేను సైతం వదిలిపెట్టలేదు. ఎళబాగురి స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈశన్న గులగన్నవార్‌ సోమవారం అంబులెన్స్‌లో శాసనసభకు హాజరై విశ్వాస పరీక్షలో పాల్గొన్నారు. ఆయన గత కొద్ది వారాలుగా గుండెనొప్పితో నగరంలోని ఒక ఆస్పత్రిలోచికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యేను వీల్‌ ఛైర్‌లో శాసనసభలోకి తీసుకువచ్చిన అంబులెన్స్‌ సిబ్బంది తరువాత అదే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు.
హైకోర్టుకెళ్లిన రెబల్స్‌
తమను శాసన సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్‌ కెజి బొప్పయ్య తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ అసమ్మతి శాసనసభ్యులు సోమవారం కర్నాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జెఎస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి కేసును మంగళవారానికి వాయిదా వేసింది.
గవర్నర్‌ చర్యను సమర్ధించిన మొయిలీ
కర్నాటకలో ఎడ్యూరప్ప సర్కారు బలపరీక్ష నెగ్గిన కొద్దిసేపటికే గవర్నర్‌ హెచ్‌ఆర్‌ భరద్వాజ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను సిఫార్సు చేయటాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ గట్టిగా సమర్ధించారు. స్పీకర్‌ కెజి బొప్పయ్య రాజ్యాంగ విరుద్ధంగా అసమ్మతి ఎమ్మెల్యేలను
సస్పెండ్‌ చేయటం వల్లే గవర్నర్‌ ఈ చర్య తీసుకున్నారని ఆయన ముంబయిలో ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. సోమవారం నాటి బలపరీక్ష సందర్భంగా శాసనసభలో భయానక వాతావరణం నెలకొందన్నారు.
సర్కారు బర్తరఫ్‌కు ప్రతిపక్షం డిమాండ్‌
శాసనసభలో బలపరీక్ష ముగిసిన అనంతరం ఆగ్రహంతో ఊగిపోయిన కాంగ్రెస్‌, జెడి(ఎస్‌) శాసనసభ్యులు గవర్నర్‌ హెచ్‌ఆర్‌ భరద్వాజ్‌ను కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బలపరీక్ష నిర్వహణకు స్పీకర్‌ అనుసరించిన విధానంలోని ఔచిత్యాన్ని వారు ప్రశ్నించారు.
ఓట్ల లెక్కింపును ఎవరూ కోరలేదు: స్పీకర్‌
అసెంబ్లీలో బలపరీక్షకు తాను అనుసరించిన విధానాన్ని స్పీకర్‌ కెజి బొప్పయ్య గట్టిగా సమర్ధించుకున్నారు. ఈ బలపరీక్షలో ఓట్ల లెక్కింపును ఏ పార్టీ కోరలేదని, అందువల్లే తాను మూజువాణి ఓటింగ్‌ను అనుమతించానని ఆయన చెప్పారు. అసెంబ్లీలోకి పోలీసుల ప్రవేశాన్ని కూడా ఆయన గట్టిగా సమర్ధించారు.
ధనబలంతో సర్కారును కూల్చే కుట్ర
విశ్వాస పరీక్ష నెగ్గిన అనంతరం ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షం ధనబలంతో తన సర్కారును కూల్చేందుకు కుట్ర పన్నిందని విమర్శించారు. ఈ కుట్రలో ప్రతిపక్షం వెదజల్లిన నోట్ల కట్టల గుట్టును తాను త్వరలోనే రట్టు చేస్తానన్నారు.
గవర్నర్‌ రీకాల్‌కు బిజెపి డిమాండ్‌
రాజ్యాంగ ప్రతినిధిగా కాక రాజకీయ నేతల తరహాలో వ్యవహరిస్తున్న గవర్నర్‌ హెచ్‌ఆర్‌ భరద్వాజ్‌ను రీకాల్‌ చేయాలని బిజెపి డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బదులుగా ఆయన అధికార పక్షానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌, జెడి(ఎస్‌)లను ఎగదోస్తున్నారని కర్నాటక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎఎస్‌ ఈశ్వరప్ప విమర్శించారు.

10, అక్టోబర్ 2010, ఆదివారం

ఆకట్టుకున్న తెలుగు తొలి జంట కవయిత్రుల అష్టావధానం

ఆకట్టుకున్న తెలుగు తొలి జంట కవయిత్రుల అష్టావధానం


తెలుగు తొలి జంట కవయిత్రులు టి. ఉదయచంద్రిక , బి.అపర్ణల అష్టావధానం సాహితీ ప్రియులను ఆకట్టుకుంది. ప్రముఖ సాహితీవేత్త తోపుదుర్తి వెంకట్రామయ్య ప్రోత్సాహంతో ఆదివారం తెలుగు లలితకళాసమితీలో డాక్టర్‌ ఆశావాది అధ్యక్షతన ఈ అష్టావధానం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటికే 24 సార్లు అవధానం చేసిన ఈ జంట కవయిత్రులు ధూలిపాల మహదేవమణితో శిక్షణ పొందారు. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన ఉదయచంద్రిక, రాజమండ్రికి చెందిన అపర్ణ అవధాన కళను సాహితీలోకానికి తెలపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అవధాన ప్రక్రియ ఒక్క తెలుగు భాషలోనే ఉన్నప్పటికీ దానికి అంత ఆదరణ లేదని, తెలుగు ప్రజలకు అవగాహన కల్పించి ఆదరణ పెంచుతామని తెలిపారు. ఫృశ్చకులు ఇచ్చిన సమస్యలను పూరించి చక్కటి ధారనా పటిమతో అవధానాన్ని రక్తి కట్టించారు. ఫృచ్చకులతోపాటు , సభకు హాజరయిన కవి పండితులు ప్రశంసించారు.
ఈ అవధానంలో ఫృశ్చకులుగా నిశిద్ధాక్షరి -డాక్టర్‌ మహ్మద్‌హుస్సేన్‌, సమస్య -నారాయణ స్వామి , దత్తపది -వైద్యం వెంకటేశ్వర్లు, వర్ణన -పద్మావతమ్మ, న్వస్తాక్షరి-పార్వతీదేవి, వారగణనం -తోపుదుర్తి వెంకట్రామయ్య, అప్రస్తుత ప్రసంగం -రామచంద్ర , గంటానాధం తెలకపల్లి పాండురంగశర్మ పాల్గొన్నారు.
పద్యకవితలో శిక్షణ అవసరం : ఆశావాది
తెలుగు సాహిత్యాన్ని కాపాడుకోవడానికి ప్రధానంగా పద్యకవితలో ఔత్సాహికులకు శిక్షణ అవసరమని ప్రముఖ అష్టావధాని డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు సూచించారు. కర్నూలు జిల్లాలో అనేక సాహితీ సంస్థలున్నాయని వారు పుస్తకావిష్కరణ సభలు, కవిసమ్మేళనాలకే పరిమితం కాకుండా పద్యకవితమై శిక్షణా తరగతులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. చక్కటి అవధానం చేసిన ఉదయచంద్రిక, అపర్ణలకు మంచి భవిష్యత్తు ఉంటుందని అభినందించారు. చిన్నపాటి లోపాలను సరిచేసుకుని ధైర్యంగా ముందుకు సాగాలని అన్నారు. అవధానంలో పూరించిన చక్కటి పద్యాలివి
నిశిద్ధాక్షరి పద్యం : -
శ్రీకిన్‌ ధీకిన్‌ నీవే
వాకున్‌ జేతుల్‌ సతంభు వాణీ నీవే
గాకర్త వింక దయతో
మాకై తలనిండియుండి మాతా గనుమా!
సమస్యాపూరణ పద్యం: -
నీవా ఇంటికి దేవతై వెలుగుచున్‌ నీరాజనంబందుచున్‌
జీవంబౌచు ప్రజాంతరంగములకున్‌ జేజేలనేబొందుచున్‌
కావేనీవు జనాలహార్టుబీటువు గదా కల్లోలమున్‌ చేసే ఓ
'' టీవీ ఎంతటి జానవైతివిగదే టీనేజి కుర్రోళ్లకున్‌ ''
దత్తపది :'' చెప్పు, చేట, పేడ, గాడిద '' పదాలతో ( అల్లసాని పెద్దనను శ్రీకృష్ణదేవరాయల సత్కారం తో పద్యం)
కైతల రేడు చెప్పు ఘన కావ్యసుధన్‌గని కృష్ణరాయలే
ఏతరి సల్పెనన్నమును పేడను చూడని రీతిలో భువిలో
నూతనమైనగాడిదను నోటబల్కగ రాజ్యమంతయున్‌
మ్రోతల చేటపాసులన్‌ ముచ్చటజేసె పెద్దనార్యుకున్‌
వర్ణన:-
ఇంతికి నర్థభాగమిడి ఈశ్వరుడొందెన్‌ లోకమాన్యతన్‌
ఎంతనిజెప్ప బూనినను ఏరికిసాధ్యముమాన్యతో శంకరుడహో
వింతగు లీలల న్నిటిని వేవుపాడగ భక్తకోటిమీ
చెంతను చేరి మ్రొక్కినను చింతలు చేరవుమానసంబునన్‌

న్యస్తాక్షరి : నవరాత్రి వచ్చేట్లుగా వృత్త పద్యం
నావరణీయ భావమున నర్తనమాడగ తల్లిరో సదా
సేవలు చేయు భాగ్యమిక తెన్నుగ భక్తుల కీయ వేడెదన్‌
కావగమమ్ము రాదె కామ్యములీయగ శంకరాకృపన్‌
ప్రోవగ కృష్టజాలమిది బ్రోచుతో మమ్ముసుగాత్రీ వేడెదన్‌.

పై పద్యాలన్నింటినీ చక్కటి ధారణతో సభికులకు వినిపించారు.

8, అక్టోబర్ 2010, శుక్రవారం

కాటికాపరులకు కష్టకాలం


  • కాంట్రాక్ట్‌ పేరుతో పొట్టగొట్టే యత్నాలు
  • చిత్తశుద్ధి లేని జిహెచ్‌ఎంసి పాలకులు
కాలే కాష్టాల మధ్య బొందలు తీస్తూ, కాడులు పేరుస్తూ ఒంటరిగా శ్మశాన వాటికకు రక్షణగా వుండే కాటి కాపరులకు కష్టకాలం వచ్చింది. శ్మశాన వాటికలను కాంట్రాక్టుకు ఇవ్వాలన్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జిహెచ్‌ఎంసి) నిర్ణయం కాటికాపరుల పొట్టగొట్టేలా ఉంది. తరతరాలుగా శ్మశాన వాటికల్లో రాత్రింబవళ్లు పనిచేస్తున్న బ్యాగరీ బతుకులు రోడ్డున పడబోతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలో నాలుగు విద్యుత్‌ శ్మశాన వాటికలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది తమ వృత్తిని బొందపెట్టేలా ఉందని కాటికాపరులు ఆందోళన చెందుతున్నారు. ఇదే తరుణంలో ఉన్న శ్మశాన వాటికలను కాంట్రాక్టుకు ఇవ్వాలని నిర్ణయించడంతో ఆ వృత్తిపై ఆధారపడి బతుకుతోన్న కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఎంతో కష్టనష్టాలను భరిస్తూ, ఎండనక, వాననక, రాంత్రింబవళ్లు శ్మశాన వాటికల్లో కాటికాపరులు సేవలందిస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలోని శ్మశాన వాటికలను ప్రైవేటు వ్యక్తులకు ఐదేళ్లకు కాంట్రాక్టుకు ఇవ్వాలని జిహెచ్‌ఎంసి నిర్ణయించింది. ఆ తర్వాత మరో ఐదేళ్లు కాంట్రాక్టును పొడింగచవచ్చు.
గ్రేటర్‌లో రెవెన్యూ రికార్డుల ప్రకారం వివిధ మతాలకు చెందిన 682 శ్మశాన వాటికలు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్‌ జిల్లాలో 391, రంగారెడ్డి జిల్లా పరిధిలో 291 శ్మశానాలు ఉన్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్‌ పరిధిలో దాదాపు వెయ్యి శ్మశాన వాటికలు ఉన్నట్లు అంచనా. ఒక్కో శ్మశాన వాటికలో కాటికాపరులుగా కనీసం ముగ్గురు పనిచేస్తున్నారు. పిల్లలు పెద్దవారై కుటుంబాలుగా విడిపోయి వంతుల వారీగా ఈ కుల వృత్తిని చేసుకుంటున్నారు. 2008 వరకు ఇవి రెవెన్యూ పరిధిలో ఉండగా ఆ తర్వాత వీటిని జిహెచ్‌ఎంసికి బదిలీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా శ్మశాన వాటికలను మున్సిపాలిటీలకు, గ్రామపంచాయతీలకు అప్పజెప్పారు. అప్పటి నుండి శ్మశాన వాటికల గురించి పట్టించుకోని జిహెచ్‌ఎంసి తాజాగా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం కాటికాపరులుగా పనిచేసే వందలాది బ్యాగరి కుటుంబాల అస్తిత్వాన్ని దెబ్బతీస్తోంది. కాంట్రాక్టర్లకు దహన సంస్కారాలు, పూడ్చడానికి సంబంధించి రేట్లను కూడా జిహెచ్‌ఎంసి నిర్ణయించనుంది. దీంతో వంశపారంపర్యంగా పనిచేస్తున్న వందలాది మంది కాటికాపరులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే అవకాశం ఉంది.
కాంట్రాక్టర్ల చేతిలో శ్మశానాలకు రక్షణ ఉంటుందా...!
శ్మశాన వాటికలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఏ మేరకు రక్షణ ఉంటుందనేది అనుమానమే. ఇప్పటికే నగరంలో అనేక శ్మశాన వాటికలు కబ్జాలకు గురయ్యాయి. ఇప్పుడు పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఉన్నవి కూడా మిగిలే పరిస్థితి ఉండదు.
కాటికాపరులుగా 25శాతం మహిళలే
నగరంలో మహిళలు కూడా కాటికాపరులుగా సేవలందిస్తున్నారు. వీరి సేవలకు గుర్తింపు లేదు. భర్తలు చనిపోయిన మహిళలు ఆ వృత్తిని చేసి కుటుంబాలను పోషిస్తున్న వారు నగరంలో దాదాపు 25 శాతం మంది వరకు ఉన్నారు. సైదాబాద్‌, సీతాఫల్‌మండీ, అడ్డగుట్ట, కొత్తపేట తదితర శ్మశాన వాటికల్లో మహిళలు కాటికాపరులుగా సేవలందిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. కాంట్రాక్టీకరణతో వీరు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతారు. ఇప్పటికే కాచిగూడ, పురానాపూల్‌, బన్సిలాల్‌పేట, మారెడ్‌పల్లి, సంజీవరావునగర్‌ శ్మశాన వాటికలు అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. అక్కడ కాటికాపరులు ఎప్పుడో వృత్తిని కోల్పోయారు. అయితే కొన్ని చోట్ల బ్యాగరులనే కూలీలుగా తీసుకుంటున్నారు.
ప్రమాదకర నిర్ణయం : సిపిఎం
శ్మశాన వాటికలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం ప్రమాదకర నిర్ణయమని సిపిఎం హైదరాబాద్‌ నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్‌ అన్నారు. శ్మశాన వాటికలను రక్షించి అభివృద్ధి పరచాల్సింది పోయి ఏదైనా ప్రైవేటుపరం చేయడమే జిహెచ్‌ఎంసి పనిగా పెట్టుకున్నట్లుందని అన్నారు. దీనివల్ల శ్మశాన వాటికలకు రక్షణ లేకుండా పోతుందని, మరో వైపు కాటికాపరులు జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడుతారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి ధరలు పెరిగాక శ్మశాన వాటికలకు ప్రమాదం ఏర్పడిందని, ఇప్పటికే అనేక శ్మశానాలు ఆక్రమణలకు గురయ్యాయని, ఇప్పుడు ఉన్న శ్మశాన వాటికలు కాటికాపరుల కారణంగానే మిగిలాయని అన్నారు. ప్రైవేటుపరం చేయకుండా శ్మశాన వాటికలను పరిరక్షించేందుకు చర్యలు జిహెచ్‌ఎంసి తీసుకోవాలని, వాటిని అభివృద్ధి పరచాలని ఆయన కోరారు.
ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి : కాటికాపరుల సంఘం
అభివృద్ధి పేరుతో శ్మశానాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కాటికాపరుల బ్యాగరీ సంఘం డిమాండ్‌ చేసింది. కాటికాపరి వృత్తిని నమ్ముకొని బతుకుతున్న బ్యాగరీ కుటుంబాల పొట్టగొట్టే విధానాలు మానుకోవాలని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌.కిష్టయ్య, ఎం.శ్రీధర్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వృత్తిని నమ్ముకొని బతుకుతున్న వారిని ప్రభుత్వం ఇప్పటివరకు ఆదుకున్నది లేదని, ఉన్న వృత్తిని కూడా దూరం చేసి దళితుల పొట్టకొట్టాలనుకుంటే సహించేది లేదని వారు హెచ్చరించారు. కాంట్రాక్టర్లకు అప్పజెప్పడం వల్ల కాటికాపరులు రోడ్డున పడితే శ్మశాన వాటికలకు రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళనా కార్యక్రమాలు చేపడ్తామని హెచ్చరించారు. ప్రభుత్వం విద్యుత్‌ దహన వాటికల ఏర్పాటును విరమించుకోవాలని, కాటికాపరుల, బ్యాగరుల వృత్తికి రక్షణ కల్పించాలని, కాటికాపరులకు గుర్తింపు కార్డులివ్వాలని డిమాండ్‌ చేశారు. శ్మశాన వాటికల అభివృద్ధి కమిటీలను రద్దు చేయాలని, శ్మశానాలను కాటికాపరులకే అప్పగించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కాటికాపరులకు, బ్యాగరులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కాటికాపరులుగా పనిచేస్తున్న వారందరికీ గౌరవవేతనం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
శవాల మీద వ్యాపారం చేయడమే : ఆర్‌.కిష్టయ్య
అభివృద్ధి పేర శ్మశాన వాటికలకు ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం శవాల మీద వ్యాపారం చేసుకునే విధంగా ఉందని చంద్రాయణగుట్టకు చెందిన ఆర్‌.కిష్టయ్య అన్నారు. కాంట్రాక్టర్లకు అప్పజెప్పడంతో జిహెచ్‌ఎంసికి ఆదాయం సమకూరుతుంది. కానీ దీనిపై ఆధారపడి బతుకుతోన్న కాటికాపరులు ఉపాధి కోల్పోతారని పేర్కొన్నారు. ఇక కాంట్రాక్టర్లు శవాలను పూడ్చడానికి, దహనం చేయడానికి ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు వసూలు చేస్తారని. శ్మశాన వాటికల అభివృద్ధి ఏమో కానీ ఆక్రమణలు, పెరిగిపోయే ప్రమాదం ఉందని అన్నారు. పేదలు, మధ్య తరగతి ప్రజలు చనిపోతే వారి దహన సంస్కారాలు పూర్తి చేయడం గగనమైపోతుంది. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లనే వసూలు చేస్తారనే నమ్మకం లేదు. డబ్బు చెల్లించలేని పేదలు చనిపోతే పరిస్థితి ఆందోళనకరం.
ప్రభుత్వ సహకారం లేకున్నా సేవలు... : ఎం.శ్రీదర్‌
కాటికాపరులకు సమాజంలో తగిన గుర్తింపు లేకపోయినా, ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందకపోయినా తాము అన్ని వర్గాల ప్రజలకు రాత్రనక, పగలనక సేవలు అందిస్తున్నామని సైదాబాద్‌కు చెందిన వృత్తిదారుడు ఎం.శ్రీదర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. బొందలు తీయడం, కాడులు పేర్చడం, శవాన్ని తగులబెట్టడం, బూడిదను పోగు చేయడం, లాంటి పనులన్నీ చేస్తున్నామన్నారు. అనాథ శవాలకు ఉచితంగా దహన సంస్కారాలు చేస్తున్నామని తెలిపారు. పేదలు ఇచ్చింది తీసుకొని తమ పనిచేసుకుపోతున్నామని, రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసినా రోజు కూలి కంటె ఎక్కువ గిట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కులవృత్తిని నమ్ముకొని బతుకుతున్నామన్నారు. పిల్లలను చదివించుకోలేని దయనీయ స్థితిలో ఉన్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేయలేదని అన్నారు. శ్మశాన వాటికల్లోనే జీవనం సాగిస్తూ ప్రమాదాలను ఎదుర్కొంటూ సేవలం దిస్తున్న తమ తరహా సేవలు కాంట్రాక్టర్లు అందించడం అనుమాన మేనన్నారు.

6, అక్టోబర్ 2010, బుధవారం

కనువిందు చేస్తున్న నల్లమల అందాలు

  • పెరుగుతున్న సందర్శకుల తాకిడి
ఎత్తైన కొండలు, పచ్చనిచెట్లతో భూమికే తలమానికంగా ఉన్న నల్లమల అందాలు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. వాటిని చూస్తేనే తప్ప తనివితీరదు. పక్షుల కిలకిలారావాలు, ఎత్తైన కొండల మీదనుండి పారే జలపాతాలు, సెలయేర్లు చూపరులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. నల్లమలలో మల్లెలతీర్థం, సలేశ్వరం, లొద్ది తదితర ప్రాంతాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. నాగర్‌కర్నూల్‌ నుండి శ్రీశైలం వెళ్లే రహదారిలో ఈ సుందర ప్రదేశాలు కనిపిస్తాయి.
శ్రీశైలం రహదారిలో..
నాగర్‌కర్నూల్‌ నుండి శ్రీశైలం వెళ్లే రహదారిలో రంగాపూరం గ్రామం దాటగానే అడవి ప్రారంభమౌతుంది. ముందుగా ఉమామహేశ్వర దేవాలయం వస్తుంది. ప్రధాన రహదారి నుండి ఐదు కిలోమీటర్లు వెళ్తే ఈ దేవాలయం ఉంది. ఇది ఎత్తైన కొండల మధ్య ఉండి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇక్కడి జలపాతాలు వేసవిలో సైతం పారుతుంటాయి. దీంతో ఇక్కడి నీటిని తాగి సాధువులు, వన్యమృగాలు, భక్తులు దాహం తీర్చుకుంటుంటారు. ఇదేదారిలో మన్ననూర్‌ తర్వాత 30 కిలోమీటర్ల దూరంలో లొద్దికి డొంక దారి ఉంటుంది. ఇది ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంది. అక్కడ కిలోమీటరు వరకు కాలినడకన లోయలోకి దిగాల్సి ఉంటుంది. అడవి ప్రాంతం నుండి వచ్చే నీరు ఈ లోయలో పడుతుంది. అన్ని కాలాల్లోనూ పారే ఈ నీరే చెంచులు, వన్యమృగాలకు ఆధారం. ఇదే దారిలో మరో 40 కిలోమీటర్లు ప్రయాణిస్తే సలేశ్వరం ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. నాలుగు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. నడవడానికి ఏలాంటి పట్టూ ఉండదు. అంతా రాళ్లు, చెట్లు, నీటి ధారలు పడుతుండడం వల్ల జారుతూ ఉంటుంది కనుక జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ 200 అడుగుల ఎత్తు నుండి నీరు ఉధృతంగా కిందకు దూకుతూ చూడడానికి మనోహరంగా ఉంటుంది. ఇక్కడి నుండి 50 కిలోమీటర్లు ప్రయాణిస్తే మరో జలపాతం కనిపిస్తుంది. అదే మల్లెలతీర్థం. ఇది వటవర్లపల్లి నుండి తొమ్మిది కిలోమీటర్లు అడవిలోకి వెళ్తే వస్తుంది. ఎండాకాలంలో అంతగా నీరు లేకపోయినా వర్షాకాలంలో జలఉధృతి తీవ్రంగా ఉంటుంది. ఈ జలపాతాలు అడవి మధ్యన ఉండడం వల్ల ఇక్కడ ఏలాంటి సదుపాయాలూ ఉండవు. సందర్శకులు ఆహార పదార్థాలు వారి వెంటే తెచ్చుకుని తినాల్సి ఉంటుంది. వటవర్లపల్లి నుండి మరో 40 కిలోమీటర్లు వెళ్తే శ్రీశైలం ప్రాజెక్టు, 60 కిలోమీటర్ల వేళ్తే శ్రీశైల దేవస్థానం వస్తాయి.
యాత్రికుల తాకిడి
శ్రీశైల దేవస్థానానికి వచ్చే యాత్రికుల తాకిడికి ప్రధాన కారణం ప్రకృతి అందాలు. వీటిని ఆస్వాదించడానికి కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా సందర్శకులు వస్తుంటారు. అడవి సంపద, జలపాతాలు, వన్యమృగాలను చూసిన తర్వాతనే సందర్శకులు శ్రీశైలం వెళ్తారు. శ్రీశైలం ప్రాజెక్టు, నీటి ప్రవాహం, పవర్‌హౌజ్‌ చూడడానికే ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఇక్కడ నూతనంగా నిర్మించిన టన్నెల్‌ పవర్‌హౌజ్‌ ప్రపంచంలోనే రెండవది. దీన్ని చూడడానికి విద్యార్థులకు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.
ప్రకృతిపై కన్ను
ప్రకృతి సిద్ధంగా ఏర్పడే జలపాతాలను చూడడానికి కూడా డబ్బులు చెల్లించాల్సిందే. ఏపి టూరిజం వారు ఒక చెక్‌పోస్టు ఏర్పాటు చేసి ప్రతి మనిషికీ ఐదు రూపాయలు, వెహికిల్‌కు 25 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. డబ్బులైతే వసూలు చేస్తున్నారు కాని వసతులు కల్పించడంలో టూరిజం శాఖ అధికారులు విఫలమయ్యారని సందర్శికులు విమర్శలు చేస్తున్నారు.
కనీస వసతులు లేవు
ఏపి టూరిజం వారు డబ్బులు వసూలు చేస్తున్నారు కాని ఏలాంటి వసతులూ కల్పించలేదు. స్నానం చేసి బట్టలు మార్చుకోవడానికి కూడా గదులు లేవు. ఒక క్యాంటిన్‌ లేదు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదు. ఇక్కడికి రావడానికి బస్సులు లేకపోతే నడిచి రావాల్సిందే. వాహనాలు కూడా ఏర్పాటు చేయలేదు. రహదారి అంతా ఎర్రటి దుమ్ము. బీటీ రోడ్డు లేదు. ఇవన్నీ లేకుండానే టోల్‌ఫీజు వసూలు చేయడం యాత్రికులను మోసం చేయడమే.
- మంగమ్మ, శ్రీశైలం యాత్రికురాలు.

ప్రాణం తీసిన మైక్రో ఫైనాన్స్‌

 

  • యువకుని ఆత్మహత్య
  • అనాథలైన భార్యాబిడ్డలు
వారం వారం చెల్లించాల్సిన మైక్రో ఫైనాన్స్‌ అప్పు ఓ యువకుడి ప్రాణం తీసింది. అప్పుతీర్చే మార్గం లేక, తోటి వారి సూటిపోటి మాటలతో తీవ్ర మానసిక వేదనకు గురై ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం అర్ధరాత్రి మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్‌ పంచాయతీ పరిధిలోని సంగాయిపల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటనలో నర్సాగౌడ్‌ (30) బలవంతంగా ప్రాణం తీసుకునానడు. భార్య లకీë నర్సమ్మ కథనం ప్రకారం... ఏడాది క్రితం వరకు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండ లానికి వలసెళ్లి జీవనం సాగించారు. ఈ మధ్యే గ్రామానికి వచ్చాక కుటుంబ పోషణ కోసం వారం వారంచెల్లించే విధంగా మైక్రో ఫైనాన్స్‌ ద్వారా అప్పులు చేశారు. వీరు వలసెళ్లడంతో అధికారులు వీరికి రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదు. రేషన్‌కార్డు లేక చిరునామా తెలిపేందుకు ఎలాంటి ఆధారం లేక గ్రామంలోని ఇతరుల పేరు మీద మైక్రోఫైనాన్స్‌ ద్వారా అప్పులు చేశారు. దీంతో పాటు ఇతర ప్రైవేటు అప్పులు కూడా ఉన్నాయి. మొత్తంగా లక్ష వరకు అప్పులున్నాయి. వాటిని తీర్చే మార్గంలేక ఇటు కుటుంబం పూటగడవక, మైక్రో ఫైనాన్స్‌ వారి ఒత్తిడి ఎక్కువవ్వడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. కూలీ పని చేసి తెచ్చిన డబ్బులు కుటుంబ పోషణకే సరిపోయేవి కావు.

ఇక వారం వారం చెల్లించాల్సిన అప్పులు ఎలా చెల్లించాలిని పలు మార్లు తన భర్త నర్సాగౌడ్‌ చెబుతూ ఏడ్చేవాడని ఆమె రోదిస్తూ తెలిపారు. రెండు రోజుల క్రితం పిల్లలతో పాటు తాను పుట్టింటికి వెళ్లానని ఈలోగా ఇంత దారుణం జరిగిపోయిందని ఆమె భోరున విలపించారు. తల్లి నిద్రలో ఉండగా నర్సాగౌడ్‌ ఇంట్లోనే దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. ఆయన మరణంతో భార్యాబిడ్డలు అనాథలయ్యారు.